MAA: ఎంతో ప్రతిష్టాత్మకంగా, రసవత్తరంగా జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసాయి. ప్రకాశ్ రాజ్ పై మంచు విష్ణు 106 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అయితే ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు ముందు ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాటల యుద్ధం నడిచింది. ఫలితాల తరువాత ఆ వేడి కొనసాగుతూనే ఉంది. తాజాగా జరిగిన పరిణామాలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనీ, బెదిరింపులకు పాల్పడ్డారంటూ ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన ప్రతినిధులు నిన్న తీవ్ర స్థాయి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల అధికారి ఏకపక్షంగా వ్యవహరించారనీ కూడా ఆరోపించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లోని అనసూయ ను ముందుగా గెలిచారు అని రాత్రికి రాత్రి ఫలితం మార్చి మరుసటిరోజు అనసూయ ఓడిపోయినట్లు ప్రకటించారన్నారు.
MAA: బ్యాలెట్ పేపర్లను ఇంటికి తీసుకువెళ్లారు
బ్యాలెట్ పేపర్ లను సైతం ఎన్నికల అధికారి ఇంటికి తీసుకువెళ్లారని నటుడు ప్రభాకర్ ఆరోపించారు. దేశ వ్యాప్తంగా ఎక్కడా ఇటువంటి తీరుగా ఓట్ల లెక్కింపు జరిగి ఉండదనీ, ఓట్ల లెక్కింపును మధ్యలో ఆపివేసి మరుసటి రోజుకు వాయిదా వేయరని మొత్తం ఓట్ల లెక్కింపు తరువాతే ఎన్నికల ఫలితాలు వెల్లడించి ఎన్నికల ప్రక్రియ ముగిస్తారని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు అంటున్నారు. తొలి రోజు గెలుపొందిన అభ్యర్థులు మరుసటి రోజు ఓడిపోయినట్లు ప్రకటించడంపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గెలుపొందిన ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన 11 మంది నిన్న తమ పదవులకు రాజీనామా చేస్తునట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీరి ఆరోపణలు, రాజీనామాలపై ఇంత వరకూ మంచు విష్ణు గానీ సినీ పెద్దలు గానీ స్పందించలేదు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ప్రతినిధులు రాజీనామా చేయడాన్ని నాగబాబు సమర్ధించారు.
ఆ వార్తల్లో నిజం లేదు
ఎన్నికల అధికారి కృష్ణమోహన్ మాత్రం వీరి ఆరోపణలపై స్పందిస్తూ వివరణ ఇచ్చారు. అనసూయ భారీ మెజార్టీతో గెలిచిందనే వార్తల్లో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తాము అధికారికంగా ప్రకటించకముందే అనసూయ గెలిచినట్లు బయట వార్తలు ప్రచారం చేశారన్నారు. తాను బ్యాలెట్ పేపర్లు ఇంటికి తీసుకువెళ్లాననే వార్తల్లో నిజం లేదన్నారు. బ్యాలెట్ పేపర్లను ఉంచిన బాక్సుల తాళాలను మాత్రమే తాను తీసుకువెళ్లానని కృష్ణమోహన్ స్పష్టం చేశారు. అసోసియేషన్ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగత విషయని పేర్కొన్నారు.