Wrestlers: జాతీయ రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలని గత 13 రోజులుగా ఢిల్లీ వేదికగా రెజ్లర్లు పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా కనిపిస్తున్నా గాని సడలని పోరాటంతో… పట్టు విడవకుండా యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ ను అరెస్టు చేసే వరకు ఊరుకునే ప్రసక్తి లేదని.. నిరసన కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. లైంగిక వేధింపుల విషయంలో బ్రిజ్భూషణ్ పై చర్యలు తీసుకోవాలని గట్టిగ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెజ్లర్లు శుక్రవారం రెండు కమిటీలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 31 మందితో ఒకటి తొమ్మిది మంది సభ్యులతో మరొకమిటి ఏర్పాటు చేశారు.
పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందిస్తూ ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు బ్రిజ్భూషణ్ పై కేసులు విచారిస్తున్నారు అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రఖ్యాత రెజ్లింగ్ కోచ్.. ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహావీర్ ఫోగట్ డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలని లేకపోతే తన మెడల్స్ తిరిగిచ్చేస్తానని హెచ్చరించారు. రెజ్లర్లు చేస్తున్న నిరసనలకు మద్దతు తెలిపారు. రెజ్లర్ల పై లైంగిక వేధింపుల కేసులో న్యాయం జరగకపోతే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. ఈ కేసులో న్యాయం జరగకుంటే నా మెడల్స్ తిరిగిచ్చేస్తానని మహావీర్ ఫోగట్.. పేర్కొన్నారు.
అయితే మహావీర్ బీజేపీ పార్టీకి చెందిన వాడు కావడంతో మీడియా ఈ విషయానికి సంబంధించి పార్టీతో లేదా కేంద్రంతో మాట్లాడి ఏదైనా పరిష్కారానికి చర్చలు చేశారా అంటూ ప్రశ్నించగా లేదు అని సమాధానం ఇచ్చారు. ఢిల్లీ వేదికగా రెజ్లర్లు చేస్తున్న నిరసన జాతీయ స్థాయిలో సంచలనం రేపుతుంది. లైంగిక వేధింపులకు కేసు విషయంలో కింది కోర్ట్ ను సంప్రదించాలని సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో రెజ్లర్లు న్యాయం నిపుణుల సలహాలు తీసుకునే పనిలో పడ్డారు. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న మిగతా క్రీడాకారుల మద్దతు కూడా కూడగడుతున్నారు.