దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా శత్రువులకు ఎదురొడ్డి పోరాటం సాగిస్తున్న జవానులకు సంబంధించిన పలు విషయాలు తెలిస్తే కంట కన్నీరు రాకుండా ఉండదు. అలాంటి ఘటనలు ఇప్పటికే చాలానే చూశాం.. అలాంటిదే మీరు ఇప్పుడు చదువబోయే సంఘటన కూడా. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో చోటుచేసుకున్న ఉగ్రవాదుల దాడుల్లో అమరుడైన ఓ జవాన్ తన కుటుంబ సంభ్యులతో జరిపిన చాట్ దేశ ప్రజలందరీ కంట కన్నీరు పెట్టిస్తోంది.
దేశ సరిహధ్దులో దేశానికి రక్షణగా నిలబడి కాపాలా కాస్తున్న సైనికులు త్యాగాలు మరువలేనివి. ఇక సంబంధిత సైనికుని కుటుంబ సభ్యుల్లో ఉండే ఆందోళన అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఏ సమయంలో ఏం జరుగుతుందో, ఎటు నుంచి ప్రమాదం పొంచి ఉంటుందో తెలియదు. అలాంటి అనుకోని విషాద ఘటన ఓ జవాను జీవితంలో చేటుచేసుకుంది. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడు ఓ జవాను. ఒకరోజు ముందు తన కుటుంబంతో చెప్పిన మాటలే తన జీవితంలో జరిగి.. అందరి హృదయాలను కదిలిస్తోంది.
వివరాల్లో కెళ్తే.. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లా చలిగావ్ గ్రామానికి చెందిన యశ్ దిగంబర్ దేశ్ముఖ్ (20) అనే యువకుడు దేశానికి సేవ చేయాలనీ, శత్రువుల నుంచి దేశాన్నిరక్షించడంలో తాను పాలుపంచుకోవాలని చిన్నప్పటి నుంచి కలలు కన్నాడు. ఈ నేపథ్యంలోనే కర్నాటకలో గతేడాది జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఉత్తమ ప్రదర్శన కనబరిచి.. జవానుగా ఎంపికయ్యాడు. శిక్షణ అనంతరం జమ్మూ కాశ్మీర్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నాడు.
ఈ నేపథ్యంలోనే జవాన్ యశ్ దేశ్ముఖ్ యోగక్షేమాలు తెలుసుకునేందుకు తన మిత్రుడు వాట్సాప్ ద్వారా తనను సంప్రదించాడు. బాగున్నావా అంటూ తన మిత్రుడు అడగగా.. దానికి స్పందించిన జవాన్ దేశ్ముఖ్.. “నేను బాగానే ఉన్నాను.. కానీ మా గురించి మీకు తెలియంది ఏముంది చెప్పు. ఇవాలా ఉంటాం.. రేపు ఉంటామో ఉండమో తెలియదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు” అని బదులిచ్చాడు. ఈ చాట్ చేసిన (నవంబర్ 25) తర్వాతి రోజే ఉగ్రవాదులు జరిపిన ఓ దాడిలో ప్రాణాలు కోల్పోయాడు దేశ్ముఖ్. ప్రస్తుతం ఈ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. అందరి కంట కన్నీరు పెట్టిస్తోంది.