మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమా తో రీ-ఎంట్రీ ఇచ్చినప్పటినుండి టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరైన త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేస్తారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అలాగే ఒకటి రెండు సందర్భాలలో నేరుగా త్రివిక్రమ్ కూడా చిరంజీవితో సినిమా తీయాలని అనుకుంటున్నట్లుగా ప్రకటించాడు. ఇక వీరిద్దరి కాంబినేషన్లో సినిమా కోసం సినీ అభిమానులంతా రెండు మూడు సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక గత ఏడాది వీరిద్దరి కాంబోలో కచ్చితంగా సినిమా వస్తుందనే వార్తలు ఊపందుకున్నాయి.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న చిరంజీవికి ఆ సినిమా వల్ల వివాదాలు చుట్టుముట్టాయి. ‘ఆచార్య’ కథను వేరొక యువ దర్శకుడి దగ్గర నుండి దొంగలించారన్న ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇక ఆచార్య సినిమా తర్వాత చిరంజీవి ‘లూసిఫర్’ రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారని వార్తలు ఉన్నాయి. కానీ లూసిఫర్ స్క్రిప్ట్ విషయంలో మాత్రం ఎవరూ సంతృప్తి చెందలేదని సమాచారం. దీంతో ఆ చిత్రం కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు. ‘ఆచార్య’ కూడా ఒక రెండు నెలలు వాయిదా పడేలాగా ఉందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఈ నేపథ్యంలో మెగా అభిమానులంతా అన్ని వివాదాలతో సతమతమవుతున్న ‘ఆచార్య; సినిమా షూటింగ్ మధ్యలో ఆపేసి అయినా త్రివిక్రమ్ తో అనుకుంటున్న సినిమా పట్టాలెక్కించాలని ఆశపడుతున్నారు. దాని తర్వాత వచ్చే పాజిటివ్ వైబ్స్ నుండి ఆచార్య సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేయవచ్చని వారి ఆశ. ఇప్పటికే చిరంజీవి కోసం కథ రెడీ చేశాడు అన్నది ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. ప్రస్తుతం త్రివిక్రమ్…. ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది చివరిలో ఈ సినిమా ఆ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్ తో సినిమా తర్వాత త్రివిక్రమ్-చిరంజీవి సినిమా చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. అయితే ఈ లోపల మెహర్ రమేష్ తో సినిమా ఒకే చేసిన చిరు…. దానిని ఎప్పుడు మొదలుపెడతాడు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.