Mohan Babu: నేడు డైలాగ్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులు పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ఇటీవలే ఆయన నటించిన సన్నాఫ్ ఇండియా విడుదలయి ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా గాని ఫ్యాన్స్… అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరగడం విశేషం. ఇక ఇదే సమయంలో మోహన్ బాబు తన పుట్టినరోజు నాడు తన విద్యాసంస్థలు విద్యా నికేతన్ ద్వారా పేద విద్యార్థులకు విద్య అందించేలా గత 30 సంవత్సరాల నుండి సేవా కార్యక్రమం కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
దీనిలో భాగంగా తాజాగా తెలుగు ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ కి చెందిన సినీ కార్మికుల పిల్లలకు మోహన్ బాబు తన యూనివర్సిటీలో ఫీజు రాయితీలు ఇస్తూ … వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపేలా చదువు అందించేలా నిర్ణయం తీసుకున్నట్లు వీడియో సందేశం ద్వారా తెలియజేశారు. ఇండస్ట్రీ తనకు ఎంతగానో ఇచ్చిందని అటువంటి పరిశ్రమకు సాయం చేయాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో 24 క్రాఫ్ట్స్ కి చెందిన సినీ కార్మికుల పిల్లలు యూనివర్సిటీలో చదువుకోవాలి అనుకుంటే కచ్చితంగా ఫీజులో రాయితీ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మోహన్ బాబు కోరారు. 1992 లో మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ అనే విద్యా సంస్థను ప్రారంభించారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన పేద విద్యార్థులకు ఈ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా ఉన్నత విద్య అందిస్తున్నారు. కులాలకు మతాలకు అతీతంగా దాదాపు 25% మందికి ఉచితంగా విద్యను అందిస్తున్నట్లు సమాచారం.