రెండు రోజుల క్రితం సినీ నటి ముమైత్ ఖాన్ తనకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని రాజు అనే క్యాబ్ డ్రైవర్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. 15,000 రూపాయలు చెల్లించకుండా క్యాబ్ డ్రైవర్ ను ముమైత్ మోసం చేయడం ఏమిటని కామెంట్లు వినిపించాయి. ముమైత్ కూడా ఈ ఘటన గురించి స్పందించకపోవడంతో చాలామంది నిజంగానే ముమైత్ డబ్బులు చెల్లించలేదని భావించారు.
అయితే ఎట్టకేలకు ముమైత్ ఈ వివాదం స్పందించింది. పంజాగుట్ట పోలీసు స్టేషన్కి హాజరై తనపై ఆరోపణలు చేసిన డ్రైవర్ పై ముమైత్ ఫిర్యాదు చేశారు. 48 గంటల నుంచి తనపై ఎదురవుతున్న ఆరోపణలను తాను పూర్తిగా ఖండిస్తున్నానని అన్నారు. 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నానని… ఒక క్యాబ్ డ్రైవర్ ను మోసం చేయాల్సిన అవసరం ఏముందని.. తన క్యారెక్టర్ ఏంటో ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుసని అన్నారు.
కొన్ని ఛానెళ్లు, వెబ్ సైట్లు తన పరువుకు భంగం కలిగే విధంగా వార్తలు ప్రసారం చేశాయని వెల్లడించారు. తన క్యారెక్టర్ ను ఎవరూ జడ్జ్ చేయాల్సిన అవసరం లేదని 23,500 రూపాయలు చెల్లించినా క్యాబ్ డ్రైవర్ తనపై ఆరోపణలు చేస్తున్నాడని అన్నారు. ముమైత్ ఖాన్ వ్యాఖ్యలతో ఎవరి ఆరోపణలు నిజమో ఎవరివి కాదో తెలియాల్సి ఉంది. రెండు రోజుల క్రితం క్యాబ్ డ్రైవర్ రాజు ముమైత్ తనకు 15 వేల రూపాయలు చెల్లించకుండా మోసం చేసిందని అన్నారు.
ఎనిమిది రోజుల పాటు తన కారులో ప్రయాణించి క్యాబ్ కు డబ్బులు చెల్లించకుండా, టోల్ ఫీజుకు కూడా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పారు. పోలీసుల దర్యాప్తులో ఈ కేసుకు సంబంధించి వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.