MAA Election: మువీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల హడావుడి, రాజకీయం సాధారణ ఎన్నికలకు మించి జరుగుతోంది. గతంలో మా అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ నటుడు మురళీ మోహన్ ప్రస్తుత ఎన్నికలపై తనదైన శైలిలో స్పందించారు. ప్రస్తుతం మా ఎన్నికల్లో కొందరు ప్రకాశ్ రాజ్, మరి కొందరు మంచు విష్ణు మద్దతుగా నిలిచారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు మెగా ఫ్యామిలీ సంపూర్ణ మద్దతు ఇస్తున్న నాగబాబు స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ క్వాలిటీస్ ఏమిటో కూడా నాగబాబు చెప్పారు. దీంతో చిరంజీవి మద్దతుదారులు అందరూ ప్రకాశ్ రాజ్ పక్షాన, మోహన్ బాబు మద్దతుదారులు అందరూ మంచు విష్ణుకు డిసైడ్ అయ్యారు. కొందరు సభ్యులు ఏటూ తేల్చుకోలేక సైలెంట్ గా ఉంటున్నారు. కోట శ్రీనివాసరావు మీడియా ముఖంగానే ప్రకాశ్ రాజ్ ప్రవర్తనపై ఆక్షేపణలు తెలియజేస్తూ మంచు విష్ణుకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.
MAA Election: మంచు విష్ణుకే మురళీ మోహన్ ఓటు
ఇదే క్రమంలో మురళీ మోహన్ కూడా మా ఎన్నికలపై స్పందిస్తూ తన ఓటు ఎవరికో పరోక్షంగా తెలియజేశారు. గతంలో సినీ పరిశ్రమలో సమస్యలు వస్తే చక్కదిద్దడానికి దాసరి నారాయణరావు, డి రామానాయుడు వంటి పెద్దలు ఉండేవారని అన్నారు. ఓ సందర్భంలో ఆ బాధ్యతలను తీసుకోవాలని చిరంజీవి గారికి తాను కోరినట్లు మురళీ మోహన్ తెలిపారు. కరోనా సమయంలో పేద నటుల కోసం చిరంజీవి తన సొంత నిధులు కోటి రూపాయలు కేటాయించడంతో పాటు నిధులు సేకరించి ఆపదలో ఉన్న వారికి సహాయం చేశారని అన్నారు. ప్రస్తుత మా ఎన్నికల్లో ఓటు ఎవరికి వేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా బుద్దిమంతుడు, సమర్ధుడికే ఓటు వేస్తానని చెప్పారు. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ లో సమర్ధుడు ఎవరని ప్రశ్నించగా ఇద్దరూ సమర్ధులే, సమ ఉజ్జీలు కాబట్టే నిలబడ్డారు. గట్టి పోటీ ఉందన్నారు. తన ఓటు ఎవరికో ఓపెన్ గా చెప్పేస్తే ఇంక బ్యాలెట్ సీక్రెసీ ఏముంటుందని అని అన్నారు. అయితే మురళీ మోహన్ తన మాటల్లో యువకుడికే అని చెప్పడం ద్వారా మంచు విష్ణు కి మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా చెప్పినట్లు అయ్యింది. యువకుడు అంటే మంచు విష్ణునే కదా అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఇద్దరూ యువకులే, ఆ మాటకు వస్తే తాను యువకుడినేనని చలోక్తి విసిరారు.
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్
కేవలం 900 ఓట్లు ఉన్న మా అసోసియేషన్ ఎన్నికలలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద రాజకీయం నడుస్తోంది. సినీ పరిశ్రమలోని ఈ ఎన్నికల రాజకీయం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. పలువురు సీనియర్ నటులు మంచు విష్ణుకు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం. ఈ సారి ఎన్నికలో కుల సామాజిక వర్గాలు కీలక పాత్ర వహిస్తున్నాయి. కమ్మ వర్సెస్ కాపు అన్నట్లుగా మా ఎన్నికలు మారిపోయాయని అంటున్నారు. రెండు ప్యానెల్స్ ఎన్నికలను ప్రతిష్టాత్మంగా తీసుకోవడంతో గెలుపు ఎవరిని వరిస్తుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత మా ఎన్నికల నేపథ్యంలో మా సభ్యులు రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఎన్నికల తరువాత పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయని మురళీమోహన్ ను ప్రశ్నించగా యుద్ధాలు ఏమీ జరగవు, అందరూ సైలెంట్ అయిపోతారని అన్నారు. బాంబులు వేసుకునేది ఏమీ ఉండదు దీపావళి టపాసులు పేలతాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మురళీ మోహన్.