Narappa: విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన నారప్ప సినిమా విడుదల తాత్కాలికంగా వాయిదా పడింది.. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 14న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తుంది. ఈ పరిస్థితుల రీత్యా నారప్ప విడుదలను వాయిదా వేస్తున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ అధికారికంగా ప్రకటించింది..
“నారప్ప కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులు, ప్రేక్షకులకు అందరికీ మనవి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో ఉంచుకొని నారప్ప చిత్రం విడుదలను వాయిదా వేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఈ మహమ్మారి వీలైనంత తొందరగా దూరం కావాలని, అందరూ క్షేమంగా ఉండాలని ఈ సినిమా కోసం అంకితభావంతో పనిచేసిన ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. ఇంట్లోనే ఉండి మనపట్ల, మన కుటుంబ సభ్యుల పట్ల అప్రమత్తంగా ఉందాం. ఈ క్లిష్ట పరిస్థితిని అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. అందరూ మాస్కులు ధరించి, దూరాన్ని పాటిస్తూ ఎవరికి వారు జాగ్రత్తగా ఉండడమే మనం పొరుగువారికి, సమాజానికి చేసే గొప్ప సహాయం. త్వరలోనే మీ ముందుకు వచ్చి మిమ్మల్ని అందరిని అలరించాలని కోరుకుంటున్నాం” అని నారప్ప టీం పేర్కొంది.
కోలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న అసురన్ రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సమాజంలోని కొన్ని ప్రాంతాల్లో ఉన్న కుల వ్యవస్థ దాని వల్ల ఎదురయ్యే సమస్యలు గురించి తెలియజేసే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు.