Nirmala Sitaraman: కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు శుభ వార్త అందించింది. డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రిడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (డీఐసీజీసీ) 1961 చట్ట సవరణలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. డీఐసీజీఐ బిల్లు 2021ను కేంద్ర మంత్రి మండలి ఆమోదించిన విషయాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. బ్యాంకులపై మారటోరియం విధించిన 90 రోజుల్లోగా ఖాతాదారులు తమ డిపాజిట్లపై అయిదు లక్షల వరకూ భీమా పొందవచ్చు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మారటోరియం విధించినా కూడా బ్యాంకు ఖాతాదారులకు డిపాజిట్ భీమా వర్తిస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
భారతదేశంలోని విదేశీ బ్యాంకు శాఖలు కూడా దీని పరిధిలోకి వస్తాయని ఆమె తెలిపారు. తాజా చట్టం వల్ల 98.3 శాతం బ్యాంకు ఖాతాదారులకు ఊరట కలుగుతుందని సీతారామన్ చెప్పారు. సాధారణంగా భీమా కింద డబ్బు పొందడానికి పూర్తి లిక్విడేషన్ తర్వాత ఎనిమిది నుండి పది సంవత్సరాలు పడుతుంది. కానీ కొత్త చట్టం వల్ల ఇప్పుడు మారటోరియం విధించినప్పటికి 90 రోజుల్లోగా ఈ ప్రక్రియ ఖచ్చితంగా పూర్తవుతుందని డిపాజిటర్లకు ఈ చట్టం ఉపశమనం ఇస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. 2020 లో ఈ భీమా మొత్తాన్ని లక్ష నుండి 5 లక్షలకు పెంచారు. అయితే ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం బ్యాంకు లైసెన్సు రద్దు చేసి లిక్విడేషన్ చర్యలు ప్రారంభించిన తర్వాతే డీఐసీజీఐ నుండి భీమా మొత్తాన్ని పొందేందుకు వీలు ఉండేది. తాజాగా ఈ డీఐసీజీసీ చట్టాన్ని సవరించడంతో దివాలా అంచున ఉన్న బ్యాంకుల ఖాతాదారులు తమ నగదును వెనక్కు తీసుకునేందుకు వేచి ఉండాల్సిన అవసరం లేదు.