Corona Vaccine: సాధారణంగా కొండ నాలికకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడింది అన్న సామెత వాడుకలో ఉంది. కానీ ఇక్కడ ఓ వ్యాధి రాకుండా మందు వేయించుకుంటే ఓ దీర్ఘకాల సమస్య పరిష్కారం అయ్యింది. అది ఎలా జరిగిందో ఓ మిస్టరీనే. వండరే.. విషయంలోకి వెళితే.. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే ఓ మహిళకు గతంలో ఎప్పుడో పోయిన కంటి చూపు తిరిగి వచ్చింది. ఈ పరిణామానికి ఆమె సంతోషం వ్యక్తం చేస్తుండగా వైద్యులకు మాత్రం ఏమీ అర్థం కాక దీనిపై పరిశీలనలు జరుపుతున్నారు.
దేశ వ్యాప్తంగా కరోనా పూర్తి స్థాయిలో కట్టడికి వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మహారాష్ట్ర వాసిం ప్రాంతానికి చెందిన మధురబాయి అనే వృద్ధురాలు కూడా వ్యాక్సిన్ వేయించుకుంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఆమె తొమ్మిదేళ్ల క్రితం కంటి శుక్లాలకు శస్త్ర చికిత్స చేయించుకుంది. అయితే ఆమె దురదృష్టం కొద్దీ శస్త్ర చికిత్స ఫెయిల్ అవ్వడంతో ఆమె కంటి చూపు కోల్పోయింది. అప్పటి నుండి ఆమె ఇతరులపైనే అధారపడి జీవనాన్ని నెట్టుకొస్తోంది. ఇటీవల మధురబాయి వ్యాక్సిన్ టీకా సెంటర్ లో కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్నది.
Read More: JC Prabhakar Reddy: మంత్రులు గాజులు తొడుక్కున్నారా..!? జేసీ ఘాటు వ్యాఖ్యలు..!!
అయితే అనూహ్యంగా వ్యాక్సిన్ తీసుకున్న రోజు నుండి ఆమెకు కళ్లు కనబడ్డాయి. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటే ఎప్పుడు ఎనిమిది ఏళ్ల క్రితం పోయిన కంటి చూపు రావడం ఏమిటని అందరూ ఆశ్చర్య పోతున్నారు. వ్యాక్సిన్ కారణంగా ఇలా జరిగిందా ? లేక వేరే ఇతర కారణం ఏమైనా ఉందా ? అన్న దానిపై వైద్యులు మధురబాయికి కంటి పరీక్షలు నిర్వహించారు. దీనిపై విషయాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకునేందుకు వైద్యులు ఆమెకు మరిన్ని పరీక్షలు చేయాలని నిర్ణయించారు. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కంటి చూపు రావడంతో మధురబాయి ఆనందం వ్యక్తం చేస్తున్నది. ఆ ఆశ్చర్యకరమైన సంఘటనపై వైద్య నిపుణులు ఏమి చెబుతారో వేచి చూడాలి.