అద్భుత ఫామ్ లో కొనసాగుతున్న భారత బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు.. సింగపూర్ ఓపెన్ 2022 టోర్నీలో దూసుకుపోతోంది. శనివారం జరిగిన సెమీస్ లో జపాన్ క్రీడాకారిణి, వరల్డ్ 38వ ర్యాంకర్ సయోనా కవాకమీని పై 21- 15, 21-7 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించి తుది పోరుకు అర్హత సాధించింది. మ్యాచ్ 32 నిమిషాల్లోనే ముగియడం విశేషం.ఈ ఏడాది రెండు సూపర్ 300 టైటిల్స్ (సయ్యద్ మోదీ, స్విస్ ఓపెన్) సాధించిన సింధు. సింగపూర్ ఓపెన్ గెలిచి తొలి సూపర్ 500 టైటిల్ కైవశం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ టైటిల్ చేజిక్కించుకునేందుకు మరో అడుగు దూరంలో నిలిచింది.
డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ అయిన సింధు.. క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి హాన్ యుయేపై 17-21, 21-11, 21-19 తేడాతో విజయం సాధించింది. సింధు తన కేరీర్ లో దాదాపు అన్ని సూపర్ 500 టైటిల్స్ సాధించినా సింగపూర్ ఓపెన్ మాత్రం గెలవలేకపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా ఈ టైటిల్ గెలవాలన్న పట్టుదలతో ఉంది సింధు.