బాహుబలి తర్వాత దక్షిణ భారతదేశ సినిమాల స్థాయిని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన చిత్రం ‘కేజిఎఫ్’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి లాంటి లార్జర్ దన్ లైఫ్ సినిమాతో రికార్డులను బద్దలు కొట్టిన రాజమౌళి పై నమ్మకంతో దక్షిణ భారతదేశం నుండి వస్తున్న ఈ సినిమాను హిందీలో, తెలుగులో విడుదల చేసేందుకు బయర్లు ముందుకు వచ్చారట. ఈ విషయాన్ని స్వయంగా కేజిఎఫ్ హీరో యశ్ చెప్పుకొచ్చాడు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో యశ్ మాట్లాడుతూ కేజిఎఫ్ మొదటి భాగం సినిమా భారీ యాక్షన్ సీన్స్ తో తెరకెక్కిందని… అయితే విడుదల విషయంలో ఆందోళన ఉండేది అని చెప్పారు. ఆ సమయంలో బెంగళూరు లోని ఒక హోటల్ లో రాజమౌళి గారిని అనుకోకుండా కలవడం జరిగిందని… ఈ సమయంలో కొద్ది నిమిషాల పాటు తమ కోసం సమయం కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తాము తీసిన కొన్ని సీన్లను ఆయనకు చూపిస్తే అతను వాటికి ఫిదా అయిపోయి తెలుగు మరియు హిందీ లో ఈ సినిమాకు భారీగా బిజినెస్ మాట్లాడారని తెలిపారు.
ఆయన చెప్పడం వల్లనే బయర్లు అతని మీద ఉన్న నమ్మకంతో సినిమాను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ముందుకు వచ్చారట. ఇక ఈ సినిమా ఎంత బాగా చేసినా కూడా విడుదల సమయంలో తీసుకునే జాగ్రత్తలు…. చేసుకునే మార్కెట్ ను బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. అలాగే తమ సినిమాకు రాజమౌళి గారు అనఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ గా మరి తమకు సాయం చేసినట్లు యశ్ నిగర్వంగా జక్కన్న రాజమౌళి గురించి చెప్పారు. గతంలో కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఇదే మాదిరిగా రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు.