RP Patnaik Tweet: కొన్ని ప్రశ్నలు సమాజాన్ని తట్టి లేపుతాయి.. కొన్ని డిమాండ్లు వ్యవస్థల్ని ఆలోచింపజేస్తాయి.. సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదం.., ఆయనపై పోలీసుల కేసు నమోదు ఘటనలో ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా సస్పందించారు. కానీ అందరి కంటే లోతుగా, ఆలోచింపజేసేలా ప్రశ్నించింది, డిమాండ్ చేసింది మాత్రం ఆర్పీ పట్నాయక్. ఆయన చేసిన ఓ సూచన పోలీసు శాఖ మొత్తాన్ని ఒత్తిడిలో నెట్టింది. “సాయి ధరమ్ తేజ్ అతి వేగంగా వెళ్లినందుకు కేసు నమోదు చేసిన పోలీసులు… నడిరోడ్డుపై ఇసుక పేరుకుపోవడానికి కారణమైన కన్స్ట్రక్షన్ కంపెనీపైనా.., రోడ్లు శుభ్రం చేయని మున్సిపల్ సిబ్బందిపైనా కూడా కేసు నమోదు చేయాలని కోరారు. అప్పుడే నగరంలో ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉంటాయని ఆర్పీ ట్వీట్ చేసారు. ఇది పాయింట్. సాయి ధరమ్ ప్రమాదం మొత్తం ఘటనలో ఆర్పీ లేవనెత్తిన పాయింట్లే ఇప్పుడు కీలకమయ్యాయి.
RP Patnaik Tweet: ప్రమాదాలకు కారణాలేమిటి..!?
రోడ్డు ప్రమాదాలకు చాలా కారణాలుంటాయి. వాహనాన్ని నియంత్రించలేని అతి వేగం మొదటి కారణమైతే.. పాడయిన రోడ్లు.., రోడ్డుపై గుంతలు, ఇసుక, నిబంధనలు పాటించకపోవడం మరిన్ని కారణాలు. హైదరాబాద్ వంటి మహా నగరంలో అతివేగంగా వెళ్లి ప్రమాదానికి గురై మరణించిన కుర్రాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆరేళ్ళ కిందట మాజీ మంత్రి నారాయణ కుమారుడు.., పదేళ్ల కిందట క్రికెటర్ అజారుద్దీన్ కుమారుడు.. అంతకు ముందు సినీ ప్రముఖుడు కోట శ్రీనివాసరావు కుమారుడు.. ఇలా చాలా మంది అతివేగం కారణంగా ప్రమాదానికి గురై మరణించారు. ఆ తర్వాత పోలీసులు ఈ అతివేగం నియంత్రణపై దృష్టి పెట్టారు. నగరంలో స్పీడ్ నియంత్రణకు కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చారు. వాహన తనిఖీలు పెంచారు. హెల్మెట్ తప్పనిసరి చేశారు. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ఔటర్ రింగురోడ్డుపై నిబంధనలు కఠినతరం చేశారు. ఎక్కువగా నైట్ పార్టీలు, కుర్రాళ్ళ జోరు ప్రయాణాలు సాగే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో రాత్రి గస్తీ పెంచారు. మొత్తానికి గడిచిన దశాబ్దకాలారంలో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రమాదాలు తగ్గేలా ఎంతో కొంత పురోగతి సాధించారు. కానీ నగరంలో రోడ్లన్నీ పోలీసుల అదుపులోనే ఉండవుగా…! అందుకే ఈ కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రోడ్లు నిర్వహణ ఎవరి బాధ్యత..!?
నగరంలో నిత్యం జరుగుతున్న నిర్మాణాలతో అక్కడక్కడా ట్రాఫిక్ డైవెర్షన్, అక్కడక్కడా రహదారులపై ఇసుక నిల్వలు తప్పవు. ఎక్కువగా వాహన రద్దీ ఉండే పంజాగుట్ట, జూబ్లీహిల్స్, కేపీహెచ్బీ, కూకట్ పల్లి, అమీర్ పేట, బేగం పేట ప్రాంతాల్లోనే నిర్మాణాలు జరుగుతుంటాయి. కొన్నేల్లుగా సాగిన మెట్రో నిర్మాణం జరిగిన తర్వాత ఇప్పుడు అదనపు హంగులు, కొన్ని భవనాల నిర్మాణాలు సాగుతున్నాయి. వాటి పనుల ఆనవాళ్లు, నిల్వలు ప్రధాన రహదారులపైనే ఉంటాయి. వాటిని లేకుండా చూసుకోవాల్సిన ఉమ్మడి బాధ్యత మున్సిపల్ సిబ్బంది, ఆ నిర్మాణ సంస్థలు, పోలీసులకు ఉంటుంది. ఇక్కడ కేసులు నమోదు వరకే పోలీసు పాత్ర అనుకుంటే ఆర్పీ చెప్పినట్టు అందరిపై కేసు నమోదు చేయాలి. లేదు.. ప్రమాదాల నియంత్రణ కూడా పోలీసుల బాధ్యత అనుకుంటే ఆర్పీ చెప్పిన పాయింట్ లో లోతుని గమనించి శాఖల మధ్య సమన్వయంతో మళ్ళీ ఇటివంటివి జరగకుండా చూసుకోవాలి.