ఆంధ్ర రాష్ట్రంలో గత కొద్ది నెలలుగా మన్సాస్ ట్రస్టు పై జరుగుతున్న వివాదం తెలిసిందే. మన్సాస్ ట్రస్ట్ తో పాటు సింహాచలం దేవస్థానం విషయంలో కూడా సంచయిత గజపతిరాజు అన్నీ అధికారాలు చేపట్టడంతో విపక్షాలు వైసీపీ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఆమె హిందూయేతర వ్యక్తి అని టిడిపి ఆరోపిస్తున్న తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వారికి తన వాయిస్ కలిపాడు.
ఇదే సమయంలో సంచయిత గజపతిరాజు మొదటి నుండి విమర్శకులపై దూకుడుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీంతో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి తన ట్విట్టర్ అకౌంట్ లో కౌంటర్ ట్వీట్లు వేశారు… అవి ఒక్కొక్కటి చూసేందుకు చాలా సాఫ్ట్ గా ఉన్నా కూడా తూటాల్లా చాలా భారీగా పేలాయి.
సంచయిత ట్వీట్లలో చెప్పిన విషయాలు ఏమిటంటే…
“శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ ప్రెస్ కాన్ఫరెన్సులో మాన్సాస్ ట్రస్ట్ ఒక హిందూయేతర వ్యక్తి నేతృత్వంలో ఉందన్నారు. అందుకే నిజాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నేను ఆనంద గజపతి రాజు & ఉమా గజపతి రాజుల పెద్ద కుమార్తెను. ఇద్దరూ హిందువులే.”
“మా అమ్మగారు పునర్వివాహం చేసుకున్న రమేశ్ శర్మగారు హిందు పురోహిత కుటుంబం నుంచి వచ్చారు. ఆయన 6 సార్లు జాతీయ అవార్డు పొంది, ఒకసారి ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయిన ఫిల్మ్ మేకర్.”
“టీడీపీ వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, పచ్చి అబద్ధాలను దయచేసి నమ్మకండి. మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం విషయంలో వారు చేసిన అవకతవకలు, అక్రమాలు ఫోరెన్సిక్ ఆడిట్లో బయటపడతాయని తెలుగుదేశం పార్టీకి భయం పట్టుకుంది. మీలాగే నేను కూడా ఒక హిందువుగా అన్ని మతాలను గౌరవిస్తాను. మీ వ్యాఖ్యలను సరిదిద్దుకుంటూ మరో ప్రకటన చేయాలనికోరుతున్నాను.”
“శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుచర వర్గం చేస్తున్న అవాస్తవ ప్రచారానికి, కట్టుకథలకు మీ ప్రకటన ద్వారా అడ్డుకట్ట వేయాలని కోరుతున్నాను. హుందాతనం కలిగిన వ్యక్తిగా మీ నుంచి నేను ఇదే ఆశిస్తున్నాను.”