తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం ఓ అమ్మాయి చేసిన అత్యాచారం ఆరోపణలు. తనను మనసికంగా, శారీరకంగా వేధించి, ఒత్తిడి తెచ్చి, కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ బెదిరించి తనపై 139 మంది అత్యాచారం చేశారంటూ సదరు యువతి వాపోయింది.
తనపై 139 మంది అత్యాచారం చేశారనే దాంట్లో, అందులో సెలబ్రిటీలు ఉన్నారంటూ చేసిన కామెంట్లలో నిజం లేదని, డాలర్బాయ్ తప్పుదోవ పట్టిస్తున్నాడని ఆరోపించింది. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకం, ఆమెతో కేసు పెట్టించిన డాలర్ బాయ్ వ్యవహారంలో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.
ఆమె చేసిన పనికి…
139 మంది తనపై అత్యాచారం చేశారని, తొమ్మిదేళ్లుగా తనపై లైంగిక దాడి జరుగుతోందంటూ భాదితురాలు పోలీసులను ఆశ్రయించడంతో పాటు.. ఏకంగా గవర్నర్కు ఫిర్యాదు చేసింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు… కేసు ఇన్వెస్టిగేషన్ ను వేగవంతం చేశారు. యువతి చేసిన ఆరోపణల్లో కొందరు ప్రముఖులు కూడా ఉండటంతో… వారు సైతం ఈ కేసుపై స్పందించక తప్పలేదు. యువతి ఆరోపణ చేసిన గంటలోపే.. సోషల్ మీడియాలో ఓ ప్రముఖ యాంకర్పై వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఆయనే ముందుకు వచ్చి వివరణ ఇవ్వటంతో పాటు… తన ఇమేజ్ను దెబ్బతీసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టనంటూ హెచ్చరించాడు. పంజాగుట్ట పీఎస్ నుంచి కేసు సీసీఎస్కు బదిలీ అవ్వడంతో… ప్రత్యేకబృందం రంగంలోకి దిగింది. యువతి ఫిర్యాదులో ఉన్న నిజానిజాలను తేల్చే పనిలో పడ్డారు.
మాట మారిపోయింది
హైదరాబాద్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆ యువతి తనని 139 మంది రేప్ చేయలేదని, తన ఫ్యామిలీని చంపేస్తానని డాలర్ బాయ్ బెదిరించి కేసును తప్పుదోవ పట్టించాడని బాధితురాలు పేర్కొంది. సెలెబ్రిటీలు తన వలన అనవసరంగా ఇబ్బందులు పడ్డారని, వారికి క్షమాపణలు చెప్తున్నానని బాధితురాలు తెలియజేసింది. డాలర్ బాయ్ ఒత్తిడి వలనే కేసులో యాంకర్ ప్రదీప్ పేరు చేర్చినట్టు ఆమె తెలిపింది. నటుడు కృష్ణుడుకి కూడా ఈ కేసుతో సంబంధం లేదని బాధితురాలు ప్రెస్ క్లబ్ లో పేర్కొన్నది. తనపై లైంగిక దాడి జరిగిన మాట వాస్తవమే అని, కానీ సెలెబ్రిటీలు కాదని బాధితురాలు పేర్కొంది. బయట 50శాతం వేధింపులకు గురైతే, డాలర్ బాయ్ వలన 50శాతం వేధింపులకు గురైనట్టు బాధితురాలు పేర్కొంది.
ఇప్పుడు డాలర్ బాయ్ ఎంట్రీ
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై సీసీఎస్ విచారణ వేగవంతమైంది. బాధితురాలి ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు… మోసం చేసిన వారిపై నిఘా పెట్టారు. మరోవైపు, యువతి ప్రజాసంఘాల సమక్షంలో బాధితురాలు నిజం చెప్పేయడంతో.. డాలర్ బాయ్ ఎంట్రీ ఇచ్చాడు. ఓ సెల్ఫీ వీడియో మీడియాకు రిలీజ్ చేసిన డాలర్ బాయ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నెల 29 తేదీన నన్ను కిడ్నాప్ చేయాలని చూశారంటూ ఆరోపించాడు. కిడ్నాపర్ల నుండి తప్పించుకొని తాను ఏసీపీకి కాల్ చేశానని చెప్పాడు అంతేకాకుండా బాధితురాలిపై నోరుపారేసుకున్నాడు. భాదితురాలు వ్యభిచారం చేసింది అంటూ సెల్ఫీ వీడియోలో డాలర్ బాయ్ ఆరోపించాడు.
ఆమెతో నా పరిచయం ఇలా..
తనకు, ఆ అమ్మాయికి మధ్య పరిచయం గురించి డాలర్ బాయ్ ఆసక్తికరంగా వివరించాడు. తనకు ఆ యువతి మ్యాట్రిమోనిలో పరిచయం అయిందని, అనంతరం తన కంపెనీకి లీగల్ అడ్వైజర్గా పని చేసిందని చెప్పుకొచ్చాడు. ఆ అమ్మాయి సర్టిఫికెట్లు ఎవరూ ఎత్తుకెళ్ల లేదని డాలర్ బాయ్ చెప్పుకొచ్చాడు. ఆమె దగ్గరే సర్టిఫికెట్లు పెట్టుకుందని.. అందరినీ నమ్మించడానికి సర్టిఫికెట్లు రజనీ చౌదరి ఇచ్చినట్లు వీడియో తీశామంటూ సెల్పీ వీడియోలో పేర్కొన్నాడు. తనను చంపుతారన్న భయంతోనే తాను తప్పించుకొని తిరుగుతున్నానని డాలర్ బాయ్ ప్రకటించాడు. తనకు పోలీస్ డిపార్ట్ మెంట్ నుండి ఎలాంటి బెదిరింపులు రాలేదని అయితే కోనేటి అశోక్, సుమన్ నుంచే ప్రాణహానీ ఉందని పేర్కొన్నాడు.