SI Edukondalu : పోలీసులు విధి నిర్వహణలో భాగంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఉంటారు.. తమకు ఎదురైన సవాళ్లను, లక్ష్యాలను ఎంతో ధైర్యంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తారు.. అటువంటి సవాలే ఓ పోలీసు అధికారికి ఎదురైంది.. అందరూ భయపడుతున్న వేళ.. తాను మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి.. చివరికి ఆ గ్రామస్తులు చేత చప్పట్లతో అభినందనలు అందుకున్నాడు.. అసలు ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
వికారాబాద్ జిల్లా, తాండూరు మండలం ,కొత్లాపూర్ గ్రామానికి చెందిన నరేష్ అనే యువకుడు మంగళవారం అర్ధరాత్రి అదే గ్రామంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్ ఐ ఏడుకొండలు వెంటనే తన సిబ్బందిని తీసుకుని ఘటనాస్థలానికి చేరుకున్నారు.. నరేష్ ఆత్మహత్య చేసుకున్న బావిని పరిశీలించారు . బావి లోకి వెళ్లేందుకు ఎలాంటి మార్గం లేకపోవడంతో బావి లోకి తాళ్లు వేశారు. ఆ యువకుడి మృతదేహాన్ని బయటకు తీసేందుకు గ్రామస్తులను సహకరించాల్సిందిగా ఎస్ఐ ఏడుకొండలు కోరారు. అయితే ఆ గ్రామస్తులు భయంతో ఎవరూ ముందుకు రాలేదు. దాంతో వెంటనే రియాక్ట్ అయిన ఏడుకొండలు తాడు సాయంతో తానే స్వయంగా బావిలోకి దిగి నీటిపై తేలియాడుతున్న శవాన్ని బయటికి తీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎస్సై ఏడుకొండలు చేసిన సాహసానికి గ్రామస్తులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ఇక యువకుడి మృతి పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నరేష్ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.