తెలుగు బుల్లితెర చరిత్రలో ఎన్నో పాటల పోటీలు, సింగింగ్ షో లు వస్తుంటాయి పోతుంటాయి కానీ పాడుతా తీయగా కి ఉన్నంత ఘనమైన ప్రస్థానం ఇప్పటి వరకు మరే ఇతర కార్యక్రమానికి రాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ‘పాదుతా తీయగా’ నభూతో న భవిష్యత్.
ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతోమంది టాలెంట్ గాయకులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించే సింగింగ్ లెజెండ్ పద్మభూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఈ నాడు మన మధ్య లేరు. అయితే అతని పాటలు ఎప్పుడూ మన చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి… అతని గళం మెదడులో పదిలంగానే ఉంటుంది…. అతడి స్వరాలు కొన్నివేల సన్నాయిల్లో ఇప్పటికీ అతనిని స్మరించుకుంటూనే ఉంటాయి. అంతటి గొప్ప ప్రతిష్ట కలిగిన బాలు గారు ‘పాడుతా తీయగా’ షో ద్వారా ఎంతోమంది గొప్ప గాయకులను బయటికి వెలికితీశారు.
వారిలో మల్లికార్జున, పార్థసారధి, సందీప్, కారుణ్య, హేమచంద్ర, గోపికా పూర్ణిమ, కౌసల్య, వేణు, గీతామాధురి వంటి ఎంతో మంది యువ గాయకులు ఈ షో నుండి వెలుగులోకి వచ్చిన వారిగా ఉన్నారు. వారందరికీ ఇన్స్పిరేషన్ ఒక్కరే… ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు. ఇక అతని ఉనికితో ఈటీవీ టిఆర్పి లు ఆకాశానికి ఎగిసిపడడంలో ఎలాంటి సందేహం లేదు. కామెడీ, ఎంటర్టైన్మెంట్ షోలు వచ్చిన తర్వాత పాడుతా తీయగా హవా కొద్దిగా తగ్గినా కూడా ఎస్పీ గారు పాట పాడుతున్నారు అంటే మాత్రం టీఆర్పీలు ఆ అయిదు నిమిషాలు తారాజువ్వలు ఎగిసి పడ్డాయి.
ఇంకా చెప్పాలంటే మిగతా సింగింగ్ షోల కి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇందులో మధుర గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు ఇచ్చే ప్రశంసలు అవార్డులు…. ఆ గాయనీ గాయకులకు ఎన్నో కీర్తి ప్రతిష్టలు కన్నా రెట్టింపు సమానం. తన పాటలను చాలా బాగా పాడిన వారికి నువ్వు నా కన్నా మంచి గాయకుడువి అవుతావు లేదా గాయకురాలిగా ప్రసిద్ధి చెందుతావు అని ఆయన ప్రశంసలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి అన్నట్లు ఎన్నోసార్లు తను సాధారణ గాయకుడినని… దేవుడు రాసిన స్క్రీన్ ప్లే లో మనమంతా జీవిస్తున్నామని చెబుతారు. ఒక గుంపులోని మనుషులు చూపించి నాకన్నా టాలెంటెడ్ మనుషులు ఇందులో చాలా మంది ఉంటారని…. అయితే దేవుడు ఇచ్చిన వరం కారణంగానే తన జీవితం ఇలా అయిందని తనని తాను తగ్గించుకునే మనిషి ఆయన. అందుకె ఆయన అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ ఎదిగే ఉంటాడు…. అతని స్వరాలతో ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటాడు.