రాజధాని అమరావతిలో పోలీసుల తాకిడి పెరిగింది. బుధవారం రాత్రి నాటికి అనూహ్యంగా కేంద్ర బలగాలు , గ్రే హౌండ్స్ ప్రత్యేక పోలీసు బలగాలు రాజ్ భవన్ వద్దకు చేరుకున్నాయి. ఇది ఎందుకా అనేది స్పష్టత లేనప్పటికీ.., గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న మూడు రాజధానులు బిల్లుపై నిర్ణయం నేపథ్యమే అని ప్రచారం జరుగుతోంది. ఈ బిల్లు గవర్నర్ వద్దకు వెళ్లి రెండు వారాలు గడిచింది. ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఇది అత్యంత సున్నిత అంశం కావడంతో ఏం నిర్ణయం తీసుకున్నా ఎంతో కొంత వివాదం, ఘర్షణ వాతావరణం చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇలా ముందస్తుగా బలగాలను దించారని అంటున్నారు.
ఈరోజు రాత్రికి లేదా, రేపు ఉదయానికి ఈ బిల్లుపై గవర్నర్ నిర్ణయం ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ బిల్లుని గవర్నర్ ఆమోదిస్తే అమరావతి ప్రాంతంలో తీవ్రంగా ఘర్షణలు చెలరేగే అవకాశం ఉంది. ఇప్పటికే 225 రోజులుగా అమరావతి ప్రాంతంలో భూములిచ్చిన రైతులు దీక్షలు చేస్తున్నారు. వీళ్లతో సహా కొన్ని పార్టీలు కూడా పోరాటానికి నేరుగా దిగే అవకాశం ఉండడంతో… ఈ భద్రత ఏర్పాట్లు చేసి ఉంటారని అనుకుంటున్నారు.