Neeraj Chopra: దేశం యావత్తు గర్వపడేలా చేసి ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని సాధించిన అథ్లెట్ నీరజ్ చోప్రాకు జనాలు జేజేలు పలుకుతున్నారు. నీరజ్ చోప్రా ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్ లు సందడి చేశారు. నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించడంతో ఒక నాడు ఎగతాళి చేసిన గ్రామస్తులు, స్నేహితులే నేడు ఆ యువకుడి ఖ్యాతిని కీర్తిస్తున్నారు. నీరజ్ చోప్రా గ్రామంలో అవమానాలు ఎందుకు ఎదుర్కొన్నాడు ? అథ్లెట్ గా ఎలా మారాడు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
నీరజ్ చోప్రా పదేళ్ల వయస్సులో ఊబకాయంతో బాధపడేవాడు. వయసుకు మించిన బరువు ఉండటంతో స్నేహితులు, బంధువులు నానా మాటలు అనేవాళ్లు. ఏరోజైనా మంచిగా కుర్తా, పైజామా వేసుకుని రోడ్డుపైకి వెళితే అరెవో సర్పంచ్ అని స్నేహితులు ఆటపట్టించే వాళ్లు. అక్కడ సర్పంచ్ అంటే ముసలోడా అని వ్యంగ్యంగా సెటైర్ వేసేవారు. ఈ అవమానాల నేపథ్యంలో ఎలాగైనా బరువు తగ్గి అందంగా తయారుకావాలని నిర్ణయించుకున్నాడు. 17 మంది సభ్యులు ఉన్న ఉమ్మడి కుటుంబంలో నీరజ్ చోప్రా అందరికంటే పెద్ద కుర్రవాడు. అతను ఏ పని చేసేవాడు కాదు. రోజు తినడం, ఖాళీగా ఊళ్లో తిరగడంతో విపరీతంగా బరువు పెరిగాడు. అతని ఊబకాయం చూసి స్నేహితులు, బంధువులు అవమానించడంతో నీరజ్ ఏడిచేవాడు. అతని బాధను చూసిన తల్లిదండ్రులు కూడా నీరజ్ బరువు తగ్గించాలని నిర్ణయించుకున్నారు.
నీరజ్ కుటుంబం పానిపట్ కు సమీపంలోని ఖాంద్ర అనే గ్రామంలో నివసించే వారు. నీరజ్ బరువు తగ్గించేందుకు ప్రతి రోజు పానిపట్ స్టేడియంకు తీసుకుని వెళ్లి రన్నింగ్ ప్రాక్టీస్ చేయించారు. అక్కడ స్టేడియంలో రోజు రన్నింగ్ చేస్తూ జావెలిన్ త్రో చేసే వాళ్లను చూసి ఆకర్షితుడైయ్యాడు. పంచకులలోని దేవీలాల్ స్టేడియంలో జావెలిన్ త్రో శిక్షణలో చేరడం నీరజ్ టర్నింగ్ పాయింట్ అయ్యింది. ఓ పక్క బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తూ మరో పక్క జావెలిన్ త్రో శిక్షణ పొందాడు. ఆ తరువాత వరుసగా జూనియర్ లెవెల్లో పతకాలు సాధించాడు. 2015 లోనే నీరజ్ 80 మీటర్ల మార్కును దాటేశాడు. అండర్ 20 ప్రపంచ చాంపియన్ షిప్ లో ఏకంగా రికార్డు సృష్టించాడు. అ తరువాత అత్యుత్తమ శిక్షణ కోసం జర్మనీ వెళ్లాడు. అక్కడ శిక్షణ పొందిన తరువాత నీరజ్ ఆటలో ఎంతో మార్పు వచ్చింది. 2018 కామన్ వెల్త్ ఆసియా క్రీడల్లో ఏకంగా బంగారు పతకాన్ని గెలిచాడు.
నీరజ్ చోప్రా క్రీడానైపుణ్యాన్ని చూసిన కోచ్ లు తప్పకుండా ఒలింపిక్ పతకం తప్పకుండా సాధిస్తాడని చెప్పేవాళ్లట. కరోనా నేపథ్యంలో ఒలంపిక్స్ వాయిదా పడిన సమయంలో భుజానికి గాయం కావడంతో ఇబ్బందిపడ్డాడు. కానీ వెంటనే కోలుకుని శిక్షణపై దృష్టి పెట్టాడు. చిన్ననాటి నుండి పెంచుకున్న కసిని మొత్తాన్ని టోక్యో నేషనల్ స్టేడియంలో చూపించి బంగారు పతకాన్ని కైవశం చేసుకుని భారతదేశం గర్వించదగిన ముద్దు బిడ్డ అయ్యాడు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?