బాలీవుడ్ యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానస్పద మృతి అనంతరం ఆ కేసు దేశవ్యాప్తంగా ఎంతటి పెను దుమారం రేపిందో తెలిసిందే. నెపోటిజమ్ నుండి మొదలైన ఈ టాపిక్ చివరికి దేశ చలన చిత్ర పరిశ్రమలోని డ్రగ్ స్కాండల్ వద్ద వచ్చి ఆగింది. సుశాంత్ మాజీ మేనేజర్ దిశ ఆత్మహత్యకు పాల్పడిన కొద్దిరోజులకే అనుమానాస్పద మృతిలో సుశాంత్ మరణించడం అనేది అనేక అనేక అనుమానాలకు కారణం అయింది.
చాలామంది డిప్రెషన్ కారణంగా నే సుశాంత్ సూసైడ్ చేసుకున్నాడని లేదా ఎవరో హత్య చేశారన్న వాదనను తెరమీదకు తీసుకొని రాగా ఈ కేసును సిబిఐ విచారణ క్రమంలో డ్రగ్స్ బాగోతం బయటపడింది. ఇక రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ప్రియురాలు రియా చక్రబోర్తి అరెస్టు చేసి విచారిస్తున్నారు.
ఇదే క్రమంలో తాజాగా సుశాంత్ స్నేహితుడు సిద్ధార్థ్ పితానీ ని సిబిఐ విచారించగా అతను చనిపోవడానికి కొద్ది రోజుల ముందు ఏం జరిగిందో సిద్ధార్థ్ వెల్లడించినట్లు తెలుస్తోంది. సుశాంత్ మేనేజర్ సూసైడ్ తర్వాత అతను ఎంతో భయాందోళనకు గురయ్యారట. తరచూ ‘నన్ను చంపేస్తారు’ అంటూ సుశాంత్ బయటకు చూస్తూ కంగారు పడుతూ ఉండేవాడు అని సిద్ధార్థ్ చెప్పుకొచ్చాడు.
ఇంకా అతను సెక్యూరిటీ కూడా పెంచుకోవాలి అనుకుంటున్నాడని సిద్ధార్థ చెప్పినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. సుశాంత్ ల్యాప్ టాప్ మరియు హార్డ్ డిస్క్ లను రియా తీసుకు వెళ్ళింది అని సిద్ధార్థ్ వెల్లడించాడు. మరోవైపు డ్రగ్స్ కోణంలో కూడా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సుశాంత్ తో సంబంధాలు ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తోంది. అయితే సుశాంత్ డ్రగ్స్ తీసుకున్నాడా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే అసలు అతన్ని అలా భయపెట్టిన వ్యక్తులెవరో త్వరలోనే తేలుతుందని మీడియా వర్గాల మాట.