ప్రస్తుత సమాజంలో పరువు హత్యలు పెరుగుతున్నాయి. అమృత ప్రణయ్ విషాదాంతం మరువక ముందే హైదరాబాద్ శివార్లలో అవంతి హేమంత్ ప్రేమ కథలో హేమంత్ పరువు హత్య వెలుగులోకి వచ్చింది. ఇందులో తప్పు ఎవరిది అని ఆలోచిస్తే సరైన సమాధానం దొరకక పోవచ్చు. ఎందుకంటే ఎవరి ఆలోచనా ధోరణిలో వారి వయసును బట్టి వారు చేసేది సరైనది అనిపించొచ్చు కాని ఒక సగటు మనిషిగా ఆలోచిస్తే పరువు అనేది ప్రాణం కన్నా గొప్పదా అనే ప్రశ్న మెదలక తప్పదు.
పరువు అనేది ఒక మనిషి జీవన విధానాన్ని సంఘంలో స్థాయిని తెలుపుతుంది ఎంతోమంది పరువే ప్రాణంగా బ్రతికే వాళ్ళు ఉన్న ఈ లోకంలో తమ పిల్లలు కులమతాలకతీతంగా వివాహాలు చేసుకోవడం నేటితరం పెద్దలకు నచ్చట్లేదు. అందుకు తమ కన్నబిడ్డలనే చంపి అయినా తమ పంతం నెగ్గించుకోవాలని చూస్తున్నారు.
అందు వల్లనే ఇలాంటి పరువు హత్యలు సంఘటనలు చూస్తున్నాం. ఇందులో రెండు కోణాలు ఉన్నాయి పిల్లలు తమ పెరిగిన పరిస్థితులు వారి తల్లిదండ్రుల ప్రేమ, పెంపకాన్ని గుర్తుంచుకొని వారు మెచ్చే రీతిలో ఉండి వారికి తగినట్లు మెలిగితే ఇలాంటి ఇబ్బందులు ఉండవు.
అలాగే తల్లిదండ్రులు కూడా వయసు ప్రాబల్యంతో పిల్లలు చేసే పనులలోని మంచి చెడులను చూసి వీలైనంత వరకు మాటలతో చెప్పి చూసి పరిస్థితి విషమించి నప్పుడు వారి జీవితం వారికి వదిలేయడం మంచిదేమో. ఏది ఏమైనా జీవితం అనేది ఎన్నో పుణ్యాలు చేస్తే దక్కే ఒక గొప్ప అవకాశం. అలాంటి జీవితాలని అనవసర పరువుల కోసం అంపణంగా పెట్టి తమ జీవితాలను లేక వేరే వారి జీవితాలను చీకటిమయం చేయడం మంచిది కాదు. ఏది ఏమైనా ప్రాణం కంటే పరువు ఎప్పటికీ గొప్పది కాలేదు అనేది ఎందరో అభిప్రాయం!