నిద్దట్లో కొంతమంది ఏదోదే కలవరిస్తూ ఉలిక్కి పడుతుంటారు. మరికొందరైతే నిద్దట్లోనే వారికి తెలియకుండానే ఏడుస్తుంటారు. వారికొచ్చిన కలలను తెల్లవారే సరికి కొందరు మర్చిపోతుంటారు. కాని మరికొందరిని ఆ కలలు మాత్రం వదలవు. వారిని వెంటాడుతూ బయపెడుతూ వుంటాయి. ముఖ్యంగా పీడ కలలు. ఈ పీడకలలు నిజజీవితానికి చాలా దగ్గరగా ఉండటం వలన మనుషులు అవి వాస్తవాలుగా మారతాయని బయపడిపోతుంటారు. అనుక్షణం అవి ఎక్కడ జరుగుతాయోనని వేదనకు గురవుతుంటారు.
దీంతో వారు మానసికంగా కుంగు బాటుకు గురయ్యి మానసిక వేదనకు గురవుతుంటారు. దీనితో పాటుగా మరీ ముఖ్యంగా ఎన్నో నిద్రలేని రాత్రులను గడుపుతూ అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. ఈ పీడ కలల మూలంగా భవిష్యత్తులో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయని పరిశోధకులు కూడా హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా పీడకలలు కనే వారిలో ఒత్తిడి, మానసిక ఆందోళనకు వారు గురవుతున్నారని పరిశోధనలో తేలింది.
ఈ పీడ కలల మూలంగా సంభవించే అనారోగ్య సమస్యలను అంచనా వేయడానికి ఓ సంస్థ 351 మందిపై పరిశోధన చేసింది. ఈ పరిశోధనలో వారు ఎన్నో విషయాలను బయటపెట్టారు. వ్యక్తుల్లో 2 నుంచి 8 శాతం మంది ఈ పీడ కలలు రావడం వల్ల ఎన్నో నిద్రలేని రాత్రులను గడిపి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నట్టు పరిశోధలను తెలిపాయి. ఈ పీడ కలల వలన ఏర్పడే నిద్రలేమిని ‘ ఆర్ఈఎం సీప్ బిహేవియర్ డిజారర్’ అంటారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ సమస్యతో బాధపడేవారికే ఈ పీడ కలలు వస్తున్నట్టు తెలిపారు. ఈ సమస్యతో సతమతమయ్యే వారు తమ చుట్టూ ఏదో జరుగుతున్నట్టుగా, ఏవేవో వారిని భయపెడుతున్నట్టుగా ఫీల్ అవుతారని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
దీని వలన నిదట్లో వారు కలవరపాటుకు గురవుతారని తెలిపారు. పీడ కలల వలన ఏర్పడే ప్రధాన సమస్య నిద్రలేమి. దీని మూలంగా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశాలన్నాయని, ఇది మితి మీరి మనిషిని డిప్రెషన్ కు గురిచేసే అవకాశాలున్నయని జాసన్ ఎల్లీస్ అనే పరిశోధకు తెలిపారు. అయితే ఈ పీడ కలలు ఎందుకు వెంటాడుతాయనేది ఇంకా తెలియరాలేనదని ఆయన వివరణ నిచ్చారు. కాగా ఈ పీడ కలలు కనే వారు తప్పకుండా డాక్టర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. మరి మిమ్మల్ని కూడా పీడ కలలు వేదిస్తున్నాయా.. ఆలస్యం చేయకుండా డాక్టర్ ను సంప్రదించడం చాలా మంచిది.