Hygiene: ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం.. శుద్ధమైన నీటిని తాగడం.. పరిశుభ్రమైన వాతావరణంలో ఉండడం మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే..!! కొందరు కడిగిందే కడిగే, తుడిచిందే తుడిచి అతి శుభ్రం చేస్తుంటారు.. అతి శుభ్రత కూడా ఆరోగ్యానికి హాని చేస్తుందని మీకు తెలుసా..!? ఎటువంటి అనారోగ్య సమస్యలకు గురి చేస్తుందంటే..!?
ఎక్కువగా శుద్ధి చేసిన నీటిని తాగడం, అతి పరిశుభ్రమైన వాతావరణంలో ఉండటం వంటివి కూడా శరీరానికి చేటు చేస్తాయి. దీనివలన ఇప్పటి వరకు మన కడుపులో ఉన్న బ్యాక్టీరియా మారిపోతుంది. స్వరూపం మార్చుకున్న కొత్త బ్యాక్టీరియా మన శరీరంలోనే అంతర్గతంగా తిరుగుబాటు చేస్తుంది. రక్షణ వ్యవస్థ కణాలు గందరగోళానికి గురై సొంత కణాలపై దాడి చేస్తాయి. ఇది పరిశోధనలలో కూడా నిరూపితమైంది. అందుకే మన దేశం నుంచి అమెరికా వెళ్ళిన వారిలో ఎక్కువ మంది ఈ వ్యాధుల బారిన పడటానికి కారణం ఇదే. అక్కడ ఇక్కడ కంటే ఎక్కువ పరిశుభ్రమైన వాతావరణం ఉండడం ముఖ్య కారణం.
పరిశుభ్రత పేరుతో మనం అతి శుభ్రం చేయడం వల్ల పిల్లలలో, పెద్దల లోనూ అలర్జీ, ఆస్తమా వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అమెరికా, ఐరోపా దేశాల పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ముక్కు బిగుసుకుపోయి నీళ్లు కారడం, కళ్ళ దురదలు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. బయటి నుంచి ఎలాంటి సూక్ష్మక్రిముల తాకిడి లేకపోవడం వల్ల మన ఒంట్లో సహజంగా ఉండే సూక్ష్మ క్రిములు వాటి స్వభావం కూడా విపరీతమైన మార్పులకు లోనవుతుంది. ఫలితంగా మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అందువలన పరిశుభ్రంగా ఉండటం అవసరమే కానీ.. అతి శుభ్రత వద్దు అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అతి శుభ్రత అనారోగ్యానికి దారి తీస్తుందని గుర్తుంచుకోవాలి.