భారతీయ మహిళా పైలట్ కి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఏవియేషన్ మ్యూజియంలో చోటు లభించింది. ఏవియేషన్ మ్యూజియంలో స్థానం పొందిన తొలి ఇండియన్ పైలట్ గా ఎయిర్ ఇండియాకు చెందిన కెప్టెన్ జోయా అగర్వాల్ రికార్డ్ క్రియేట్ చేసింది. జోయా అగర్వాల్ అతి పిన్న వయస్కురాలైన బోయింగ్ 777 కమాండర్ గా నిలిచింది. జోయా టీమ్ లో ఉన్న ఎయిర్ ఇండియా మహిళ సిబ్బంది ప్రపంచంలోనే అత్యంత పొడవైన విమాన మార్గాన్ని కవర్ చేశారు. రికార్డు స్థాయిలో 16,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు వరకు ఉత్తర ధువ్రాన్ని కవర్ చేస్తూ వీరి ప్రయాణం సాగింది.
తొలి భారతీయ పైలట్ గా రికార్డ్..
ఎయిర్ ఇండియా మహిళా పైలట్ల విజయాన్ని చూసి అమెరికన్ ఏవియేషన్ మ్యూజియం జోయా అగర్వాల్ కు తన మ్యూజియంలో చోటు కల్పించింది. తమ మ్యూజియంలో చేర్చబడిన మొదటి భారతీయ పైలట్ జోయా అని ఎస్ఎఫ్ఓ అధికారి తెలిపారు. 2021లో శాన్ ఫ్రాన్సిస్కో ఏవియేషన్ నుంచి బెంగళూరు వరకు మహిళా పైలట్లతో రికార్డు స్థాయిలో విమానాన్ని నడిపిందని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర అమ్మాయిలు, మహిళలకు ఆమె ప్రేరణగా మారిందని పేర్కొన్నారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక మ్యూజియంలో స్థానం పొందిన మొదటి భారతీయ మహిళ కావడం తనకు, దేశానికి గర్వకారణమని జోయా అగర్వాల్ తెలిపారు.
అత్యంత పొడవైన విమాన మార్గాన్ని కవర్ చేసిన జోయా
జోయా పైలట్ గానే కాదు మంచి స్పీకర్ కూడా.. యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు 12 సార్లు Tedx స్పీకర్ గా విలువైన జీవిత పాఠాలు అందించారు. జనరేషన్ ఈక్వాలిటీ, యూఎన్ ఉమెన్ ఇండియా జనరేషన్ ఈక్వాలిటీ అల్లీ, భారత్ కి బేటీ ప్రచారాల కోసం మహిళా ప్రతినిధిగా జోయా ఉంది.. ఇక శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో 1980లో మ్యూజియం ఏర్పాటు అయ్యింది. ఐదు టెర్నినల్స్ లో విస్తరించి ఉన్న గ్యాలరీలో వాణిజ్య విమానయాన చరిత్రకు సంబంధించిన కళాఖండాల సేకరణతో పాటు ఎంతోమంది పైలట్ల సాహసాలు, చారిత్రక సంఘటనలు మ్యూజియంలో ఉన్నాయి. జోయాకు సంబంధించి.. ఆమె వ్యక్తిగత చరిత్ర, కలలు, సాధించిన విజయాలు ఈ మ్యూజియంలో ఉన్నాయి..