Hyponatremia: శరీరం సక్రమంగా పనిచేయాలంటే రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తీసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. నీరు తక్కువగా తాగితే డీహైడ్రేషన్ గురవుతాం అని అందరికీ తెలిసిందే.. అదే నీటిని ఎక్కువగా తాగితే..!? అనే ప్రశ్న మనలో చాలామందికి వచ్చి ఉంటుంది.. అధికంగా నీటిని తీసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి..!? తీసుకోవాలసిన జాగ్రత్తలేంటో చూద్దాం..!!
ఎక్కువగా నీటిని తీసుకుంటే శరీరంలో నీరు నిలిచి పోవడం అధికమవుతుంది. అందువలన రక్తంలో ప్రమాదకరంగా సోడియం స్థాయిలు తగ్గుతాయి. సోడియం యొక్క తక్కువ రక్త సాంద్రత ను హైపోనట్రేమియా అంటారు. తగినంత సోడియంని భర్తీ చేయకుండా నీటిని ఎక్కువగా తాగడం వలన ఇలా జరుగుతుంది. దీనినే హైపోనట్రేమియా, ఓవర్ హైడ్రేషన్, హైపర్ హైడ్రేషన్, వాటర్ పాయిజనింగ్ అని పిలుస్తారు. సోడియం చాలా ముఖ్యమైన మూలకం. ఇది గుండె, కణాలు, మూత్రపిండాల పనితీరును నిర్వహించడానికి చాలా అవసరం. మనం అవసరానికి మించి నీరు తాగినప్పుడు ఆ నీటిలో సోడియం కలిసిపోయి కిడ్నీల ద్వారా శరీరం నుంచి బయటకు వస్తుంది. ఈ ప్రక్రియ చాలా కాలం పాటు కొనసాగితే శరీరంలో సోడియం లోపం కలుగుతుంది.
తలనొప్పి విపరీతంగా ఉన్న, ఆకలి వేయకపోయినా, చిన్న పని చేసినా కూడా నీరసం, నిస్సత్తువ కనిపించినా, ఆహారం తీసుకున్న వెంటనే వాంతులు అయినా అవన్నీ హైపోనట్రేమియా లక్షణాలు. జ్ఞాపక శక్తి తగ్గిన, తల తిరుగుతున్న, కూర్చున్నప్పుడు కూడా తల తిరిగినట్లుగా అనిపించినా హైపోనట్రేమియా లక్షణాలు అని గుర్తించండి. పైన చెప్పుకున్న లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజుకి ఎనిమిది గ్లాసుల నుంచి పది గ్లాసుల మాత్రమే నీటిని తీసుకోవాలి. అంతకుమించి ఎక్కువ మోతాదులో నీటిని తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. వీటితో పాటు మెదడు వాపు కూడా ఏర్పడుతుంది.