ప్రపంచం మొత్తం మీద అతి భయంకరమైన కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో, గత కొద్ది నెలలుగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. అయితే లాక్ డౌన్ కారణంగా అన్ని కార్యకలాపాలు మూతపడ్డాయి. ఈ కారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్ళకు మాత్రమే పరిమితం అయ్యారు. రోజు రోజుకి శరవేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ పురుషులలో కన్నా మహిళల్లో అధిక ఒత్తిడి, తీవ్రతలకు గురి చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. అధిక ఒత్తిడి వల్ల మహిళలు తీవ్ర ఆందోళన చెంది మద్యానికి బానిసలు అవుతున్నారని తాజా పరిశోధనలో వెల్లడైంది..
తాజా పరిశోధనల ప్రకారం ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో విద్యాసంస్థలు, ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలు మూతపడటంతో ప్రతి ఒక్కరూ ఇంటిపట్టునే ఉన్నారు. దీని కారణంగా మహిళల్లో అధిక ఆలోచనలు, ఉద్యోగం లేదనే ఆందోళన, కరోనా వైరస్ బారిన పడతారేమో అని ఇటువంటి ఆలోచనలు తరచూ చేయడం వల్ల వారు మానసికంగా అధిక ఒత్తిడికి లోనవుతూ, మద్యానికి బానిసలు అవుతున్నారని తాజా అధ్యయనాల్లో వెలుగులోకి వచ్చింది.
మహిళలు మద్యపానం సేవించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. మద్య పానం తాగడం వల్ల తరచు గుండె సమస్యలు, కాలేయ సమస్యలు , ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సర్వేలలో ప్రతి సంవత్సరం సాధారణంగా మరణించే వారి కన్నా మద్యం తాగడం వల్ల మరణించేవారి సంఖ్య మహిళలలో ఎక్కువగా ఉందని వెల్లడైంది.
ఊహించని విషయం ఏమిటంటే… పట్టణ ప్రాంతాలలో నివసించే మహిళలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో నివసించే మహిళలు ఎక్కువగా మద్యానికి బానిసలు అవుతున్నారు. ప్రశాంతమైన గ్రామీణ వాతావరణంలో ఉండి గ్రామీణ మహిళలు మద్యానికి ఏ కారణం వల్ల బానిసలవుతున్నారో సరైన కారణం తెలియలేదు.