YS Jagan Anil Kumble Meet: ప్రఖ్యాత క్రికెటర్ అనిల్ కుంబ్లే ఈరోజు సాయంత్రం సీఎం జగన్ తో భేటీ అయ్యారు.. రాజకీయాలకు, ఈ రాష్ట్రానికి ఏమాత్రం సంబంధం లేని, ఒక క్రికెటర్ ఎందుకు వచ్చినట్టు..? అరగంట పాటూ ఏం మాట్లాడినట్టు..? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే అనిల్ కుంబ్లే – జగన్ భేటీలో మూడు కీలక ప్రతిపాదనలు పెట్టినట్టు తెలిసింది. ఏపీలో క్రీడల అభివృద్ధి కోసం ఈ ఇద్దరి భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. జగన్ తో సమావేశం సందర్భంగా అనిల్ కుంబ్లే కీలక సూచనలు అందించారు. అవేమిటంటే…
* ఏపీలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పాలని సూచించారు. విశాఖ లేదా అమరావతి ప్రాంతంలో ఎక్కడైనా సువిశాల విస్తీర్ణంలో క్రీడా విశ్వవిద్యాలయం నెలకొల్పితే ఏపీపై విదేశాల దృష్టి కూడా పడుతుందని, రాష్ట్ర ప్రగతికి సహకరిస్తుందని అనిల్ కుంబ్లే సూచించినట్టు తెలిసింది.
* రాష్ట్రంలో క్రీడా పరికరాల తయారీ పరిశ్రమ నెలకొల్పాలని సూచించారట. దేశంలో ప్రస్తుతం రెండు చోట్ల మాత్రమే క్రీడా పరికరాల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఏపీలో ఈ పరిశ్రమ పెడితే మంచి అభివృద్ధి కనిపిస్తుందని.., తీర ప్రాంతాల ద్వారా విదేశాలకు కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కుంబ్లే సూచించినట్టు తెలిసింది.
* ఇక తన క్రీడా అకాడమీ కోసం స్థలం కేటాయించాలని కోరినట్టు సమాచారం. రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతంలో తాను అకాడమీ నెలకొల్పడానికి సిద్ధంగా ఉన్నానని.., ప్రభుత్వం తరపున స్థలం కేటాయించాలని కోరినట్టు సమాచారం.
ఈ ప్రతిపాదనలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. మరో దఫా భేటీలో ఈ చర్చల ఫలితం కొంతమేరకు కనిపించవచ్చని అధికార వర్గాలు ఆశిస్తున్నాయి.