రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త అంశం తెర మీదకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డికి అతని సోదరి వైయస్ షర్మిల కు మధ్య వివాదం నడుస్తోంది అని టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా వీరిద్దరి మధ్య జరుగుతున్నది రాజకీయ వైరం అని అంటున్నారు. ఎంతో విచిత్రంగా ఈ విషయాన్ని వైఎస్ సొంత జిల్లా అయిన కడప నుండి ప్రచారం చేస్తున్నారు. ఇక ఇటీవల పరిణామాలను కారణంగా చూపించి వారు ఈ వాదనను తెరమీదకు తెచ్చారు.
ముందుగా ఇడుపులపాయలో మొన్న వైయస్ ఫ్యామిలీ పాల్గొన్న క్రిస్మస్ వేడుకలకు షర్మిల రాలేదు. ప్రతియేటా తప్పకుండా వచ్చే ఆమె ఈ సంవత్సరం రాకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అని అందరూ ఆలోచనలో పడ్డారు. అంతేకాకుండా 21వ తేదీన తన సోదరుడు జగన్ పుట్టినరోజు కార్యక్రమాల్లో కూడా ఆమె కనపడిన దాఖలాలు లేవు. ఇక ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్రంలో వైసీపీ వ్యవహారాల్లో షర్మిల కీలక పాత్ర పోషిస్తున్నారు అన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ మధ్య లోనే అన్నా చెల్లెలు కి అసలు పడట్లేదని… విభేదాలు తలెత్తాయని వార్తలు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎంత గొడవలు ఉన్నా కుటుంబం మొత్తం క్రమం తప్పకుండా పాల్గొనే వేడుకలకు షర్మిల రాకపోవడంతో ఈ అనుమానాలన్నీ బలపడ్డాయి.
రాజకీయంగా షర్మిలకు ఒక రకంగా మంచి మైలేజ్ ఉంది అనే చెప్పాలి. జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆమె పార్టీని ముందుండి నడిపించింది. ప్రజాప్రస్థానం పాదయాత్ర కూడా చేసింది. ఆమె పడిన కష్టాన్ని ఎవరైనా తేలికగా గుర్తిస్తారు. కాని జగన్ విడుదలయ్యాక అసలు రాజకీయాలలో ఆమె తల దూర్చింది లేదు. ఇంటికే పరిమితం అయింది. ఇక జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా దాదాపు షర్మిలను రాజకీయాలకు దూరం పెట్టేశారు. దీంతో ఆమె నొచ్చుకున్నారు అని… ఇక తెలంగాణ వ్యవహారాలు అప్పగిస్తారు అనుకుంటే అది కూడా లేకపోవడంతో ఆమె మనస్థాపానికి గురి అయ్యారు అని వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ మధ్య అమెరికాలో ఉన్న తన కుమారుడి దగ్గరికి వెళ్లి అక్కడ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవాలని షర్మిల పట్టుబట్టినట్లు వైసిపి వర్గాలు వివరిస్తున్నాయి. అందుకే ఇడుపులపాయకు రాలేక పోయింది అని అంటున్నారు. ఈ విషయాన్ని వారు వీరు అనే కంటే షర్మిల నోటి ద్వారా స్వయంగా వింటే… ఏ గొడవా ఉండదు.