ఢిల్లీ, జనవరి 4: రెండు వేల నోట్ల ముద్రణ విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అన్నారు. రెండు వేల నోట్లను కనిష్ట స్థాయికి తీసుకువస్తుట్లు వచ్చిన వార్తలపై ఆయన శుక్రవారం వివరణ ఇస్తూ ప్రస్తుతం అవసరమైన దాని కంటే ఎక్కువగానే రెండు వేల నోట్లు చలామణిలో ఉన్నాయన్నారు.
“వ్యవస్థలో ప్రస్తుతం అవసరమైన దాని కంటే ఎక్కువ రెండు వేల నోట్లు ఉన్నాయి. దాదాపు 35శాతం నోట్లు చలామణీలో ఉన్నాయి, రెండు వేల నోట్ల ముద్రణకు సంబంధించి ప్రస్తుతం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు” అని ఆయన స్పష్టం చేస్తూ.. అవసరాన్ని బట్టి నోట్ల ముద్రణ ఉంటుందని అన్నారు.
రిజర్వు బ్యాంకు రెండు వేల నోట్ల ముద్రణను కనిష్ఠ స్థాయికి తగ్గించిందని ఆర్థికశాఖ ఉన్నతాధికారి గురువారం వెల్లడించగా, ఈ నోటు క్రమేణా కనుమరుగు అవ్వనున్నాయిని వార్తలు వచ్చాయి.
చలామణీలో ఉన్న నగదుపై సమీక్ష జరిపిన కేంద్రం, ఆర్బిఐ ఏ మేరకు కొత్త నోట్లను ముద్రించాలన్న దానిపై తగిన నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగానే రెండు వేల నోట్ల ముద్రణను తగ్గించినట్లు వెల్లడించారు.