సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అమ్ములపొది నుంచి బ్రహ్మాస్త్రం బయటకు తీసింది. రాజీవ్ – సోనియా కుమార్తె ప్రియాంకా గాంధీ వాద్రాను క్రియాశీల రాజకీయాల్లోకి దింపాలని నిర్ణయించింది. బుధవారం ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఒక ప్రకటన జారీ చేశారు. దీనితో ఏళ్ల తరబడి సాగుతున్న ఊహాగానాలకు తెర పడింది.
ప్రియాంక పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం ఇన్చార్జ్గా వ్యవహరిస్తారు. అత్యుత్సాహం…దూసుకెళ్లేందుకు సిద్ధం అంటూ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.
Many congratulations to Shri K C Venugopal, Smt. Priyanka Gandhi Vadra and Shri @JM_Scindia on their new appointments. We're fired up & ready to go! https://t.co/q7sMB8m6DO
— Congress (@INCIndia) January 23, 2019
కాంగ్రెస్కు పూర్వ వైభవం తిరిగి ఎవరైనా తీసుకురాగలరంటే అది ఒక్క ప్రియాంకా గాంధీయేనని కాంగ్రెస్ శ్రేణుల విశ్వాసం. దానికి ప్రధాన కారణం ఆమె తన నాన్నమ్మ ఇందిరా గాంధీని పోలి ఉండడం. ప్రియాంక కాంగ్రెస్ రాజకీయాల్లోకి రావాలని పార్టీ శ్రేణుల నుంచి చాలా కాలంగా విజ్ఞప్తులు అందుతూనే ఉన్నాయి. అయితే ఆమె ఇంతవరకూ తన సోదరుడు రాహుల్ గాంధీ, తల్లి సోనియా గాంధీ నియోజకవర్గాలకే పరిమితమవుతూ వచ్చారు.
కేంద్రంలో ఏ పార్టీ అయినా అధికారం చేపట్టాలంటే దానికి ఉత్తరప్రదేశ్లో ఎన్ని సీట్లు వస్తాయన్నది ప్రధానం. అలాంటి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ ఈ మధ్య కాంగ్రెస్ను పట్టించుకోకుండా ఎన్నికల పొత్తు ప్రకటించాయి. సోనియా, రాహుల్ సీట్ల జోలికి వెళ్లం తప్ప కాంగ్రెస్తో పొత్తు ఉండదని ఆ పార్టీలు స్పష్టం చేశాయి. ఈ అవమానాన్ని కాంగ్రెస్ దిగమింగి వారి పొత్తును స్వాగతించింది. ఇప్పుడు ప్రియాంకను తెర మీదకు తెచ్చి తమ వ్యూహమేమిటో ప్రకటించింది. ఈ తాజా పరిణామం నేపధ్యంలో ఆ పార్టీల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
బిజెపి ఈ పరిణామాన్ని తేలిగ్గా కొట్టి పడేసింది. ‘రాహుల్ విఫలమయ్యారు కాబట్టి ప్రియాంకను ఊతంగా తెచ్చుకుంటున్నారు. వారికి ఆ కుటుంబం తప్ప ఎవరూ కనబడరా’ అని బిజెపి అధికార ప్రతినిధి సంవిత్ పాత్రా వ్యాఖ్యానించారు. బిజెపి చాలాకాలంగా ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా అవినీతిపరుడంటూ విమర్శలు గుప్పిస్తోంది.