ఇన్నాళ్లకు ఆరెస్సెస్ నేతలు పరోక్షంగానయినా ఒప్పుకున్నారు. ఎన్నికల సీజన్లో రామజన్మభూమి వివాదం రాజుకోవడం చాలాకాలం నుంచీ జరుగుతోంది. అయోధ్యలోని వివాదస్థలంలో రామాలయం నిర్మించాలన్న డిమాండ్ను సంఘపరివార్, బిజెపి ప్రతిసారీ ఎన్నికల ముందు తీసుకురావడం హిందువుల వోట్లు సంపాదించడం కోసమేనన్నది ప్రతిపక్షాల విమర్శ.
ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా బిజెపికి చీమ కుట్టినట్లయినా ఉండదు. నిజానికి ఆ విమర్శలను వారు స్వాగతిస్తారు. అలాంటి విమర్శలు వస్తే ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ మైనారిటీల పక్షమని ప్రతివిమర్శ చేసేందుకు బిజెపికి అవకాశం దొరుకుతుంది. ఆ విమర్శ హిందువుల వోట్లను మరింత సంఘటితం చేయవచ్చు కదా!
ఇప్పుడు శివసేన పుణ్యమా అంటూ రామజన్మభూమి వివాదానికి సంబంధించి సంఘ్ అసలు రంగు బయటపడింది. అయోధ్యలో రామాలయం నిర్మించాలన్న డిమాండ్ను తలకెత్తుకుంటే బిజెపికి వచ్చినట్లు తమకు కూడా వోట్లు వస్తాయని శివసేన నేత ఉద్ధవ్ థాకరే భ్రమ పడుతున్నారని ఆరెస్సెస్ పత్రిక తరుణ్ భారత్ సంపాదకీయంలో రాశారు.
దీనికి సందర్భం ఏమంటే ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించేందుకు రాహుల్ గాంధి అంటున్న మాటతోనే ఆయనను ధాకరే కూడా విమర్శించారు. చౌకీదార్ హీ చోర్ హై (కాపలాదారే దొంగ) అని మోదీని ఉద్దేశించి థాకరే అన్నారు. ఈ విమర్శపై స్పందించేందుకు బిజెపి నాయకులు నిరాకరించారు గానీ సంఘ్ సంపాదకీయం ద్వారా స్పందించింది. రామాలయం డిమాండ్తో బిజెపికి వచ్చినట్లు వోట్లు వస్తాయనుకుంటున్నారా అని ప్రశ్నించింది. మిత్రపక్షంగా ఉంటూ ఈ విమర్శలేమిటని మండిపడుతూ, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి తప్పుకుని మాట్లాడాలని డిమాండ్ చేసింది.