ఢిల్లీ: అంతరిక్ష పరిశోధనలో భారత్ అతి పెద్ద నాలుగో దేశంగా అవతరించిందని ప్రధాని నరేంద్ర మోది అన్నారు. దేశ శాస్త్ర సాంకేతిక వృద్ధిపై ప్రధాని మోది బుధవారం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
అంతరిక్ష ప్రయోగాలలో అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ నిలిచిందని చెప్పడానికి గర్వపడుతున్నానని మోది అన్నారు. ‘అంతరిక్షంలో భారత్ ఘన విజయం సాధించింది. మిషన్ శక్తి ఆపరేషన్ పూర్తి అయ్యింది. మిషన్ శక్తి అనేది అత్యంత కఠినమైన ప్రయోగం (ఆపరేషన్). దీని ద్వారా అంతరిక్షంలో శాటిలైట్ను పడగొట్టాం. ఏ శాట్ ఆర్బిట్ శాటిలైట్ను మూడు నిమిషాల్లో కూల్చివేసింది. భారత్ అభివృద్ధి పథంలో ఇదో గొప్ప మైలు రాయి’ అని మోది పేర్కొన్నారు. ఇందుకు డిర్డివో శాస్త్రవేత్తలను అభినందించారు.
నేడు వ్యవసాయం, విపత్తు నిర్వహణ, కమ్యూనికేషన్, వాతావరణం, నావిగేషన్ తదితర ఎన్నో రంగాల్లో మనకు సరిపడా శాటిలైట్లు ఉన్నాయని మోది అన్నారు. దేశ భద్రత, ఆర్థిక వృద్ధి, సాంకేతిక అధునీకరణ కోసం మిషన్ శక్తి కీలక ముందడుగు లాంటిదని మోది పేర్కొన్నారు.
ఈ ప్రయోగం ఏ దేశానికి వ్యతిరేకంగా చేసిన ప్రయోగం కాదు, కేవలం మన దేశ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించుకోవడం కోసం చేసింది మాత్రమేనని మోది స్పష్టం చేశారు.
An important message to the nation. Watch. https://t.co/0LEOATgOOQ
— Narendra Modi (@narendramodi) March 27, 2019