(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
దక్షిణాఫ్రికాలో అతిపెద్దదైన ఓ భారీ భవనం క్షణాల్లోనే నేలమట్టమైంది. జోహన్నెస్బర్గ్లోని 108 మీటర్ల ఎత్తైన బ్యాంక్ ఆఫ్ లిస్బన్ భవనాన్ని అధికారులు కేవలం 30 సెకన్లలోనే కూల్చివేశారు. గత సెప్టెంబర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ భవంతి తీవ్రంగా దెబ్బతింది. ఆ ప్రమాదంలో ముగ్గురు అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఆ భవనం ఎంతమాత్రం సురక్షితం కాదని అంచనాకు వచ్చిన అక్కడి ప్రభుత్వం.. కూల్చివేయాలని నిర్ణయించింది. దీంతో ఆదివారం ఉదయం 22 అంతస్తుల ఈ భవనాన్ని 894 కిలోల పేలుడు పదార్థాలు ఉపయోగించి కూల్చివేశారు. అంతకు ముందు సమీపంలోని రెండు వేల మందిని వేరే ప్రాంతాలకు తరలించారు.
ఇప్పటివరకు నేలమట్టం చేసిన భవనాల్లో 114 మీటర్ల ఎత్తున్నభవనం మొదటిది కాగా..108మీటర్ల ఎత్తుతో బ్యాంక్ ఆఫ్ లిస్బన్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ భవనాన్ని కూల్చడం కష్టమయినా.. విజయవంతంగా పూర్తి చేశామని తన్నీమ్ మోతారా అనే మహిళా అధికారి తెలిపారు. దీని స్థానంలో కొత్త భవనాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.