(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ -2 ప్రయోగం చివరి ఘట్టానికి చేరుకున్నది. ల్యాండర్ విక్రమ్ జాబిల్లిపై పాదం మోపే సమయం దగ్గరపడింది. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై పాదం మోపనుంది.
48 రోజుల అద్భుత ప్రయాణం విజయవంతంగా ముగియాలని కోట్లాది భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ దేశాల చూపు కూడా విక్రమ్ వైపే ఉంది.
నేటి అర్థరాత్రి దాటిన తరువాత ఒంటి గంట నుండి రెండున్నర గంటల మధ్య విక్రమ్ ల్యాండర్ను జాబిల్లిపై దించే ప్రయత్నం చేపట్టనున్నారు.
విక్రమ్ ల్యాండింగ్ను ప్రధాని మోది బెంగళూరులోని మిషన్ ఆపరేషన్ సెంటర్ నుండి తిలకించనున్నారు. దేశ వ్యాప్తంగా తొమ్మిది, పదవ తరగతి విద్యార్థులకు ఇస్రో నిర్వహించిన పోటీలలో విజేతల్లో రాష్ట్రానికి ఇద్దరు చొప్పున ప్రధానితో కలిసి ఈ ల్యాండింగ్ను తిలకిస్తారు.