(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
సమాజంలో కుల పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. రాకెట్లు దూసుకెళ్లే కాలంలో కూడా ఎక్కడోచోట ఈ గజ్జి ఇప్పటికీ బయటపడుతూనే ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లుదాటినా.. కులం అడ్డుగోడల్ని ఇంకా పెకిలించలేకపోయింది. తాజాగా తమిళనాడులో జరిగిన ఓ ఘటన.. సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తోంది. తమ పంటపొలాల నుంచి దళిత వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు వీల్లేదంటూ అగ్రవర్ణాలు అడ్డగించాయి. దీంతో మరోదారిలేక వంతెన పై నుంచి మృతదేహాన్ని కిందకు జారవిడిచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమిళనాడులోని వెల్లూరు జిల్లా వనియంపాడికి చెందిన ఎన్.కుప్పమ్ అనే వ్యక్తి శనివారం మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే గ్రామంలోని దళితులకు ప్రత్యేక స్మశానం లేకపోవడంతో.. మృతదేహాలన్నింటిని ఒకేచోట ఖననం చేస్తున్నారు. స్మశానవాటికకి వెళ్లాలంటే అగ్రవర్ణాలకు సంబంధించిన వారి పొలం మీదుగా వెళ్లాలి. అయితే తమ పొలంలో నుంచి వెళ్లేందుకు వీల్లేదంటూ అక్కడి అగ్రవర్ణాల వారు అభ్యంతరం తెలిపారు. దీంతో రోడ్డుపై నుంచి వెళ్లకుండా 20 అడుగుల ఎత్తు ఉన్న బ్రిడ్జీ నుంచి తాళ్ల సాయంతో మృతదేహాన్ని స్మశానంలోకి దించారు. అక్కడే అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Denying dignity to the dead: This is how Dalits at Narayanapuram village in Vellore district are forced to transport a body to the crematorium. This is because they are denied access to a public road and a local crematorium by caste Hindus. @thenewsminute pic.twitter.com/x3r5AnWIao
— priyankathirumurthy (@priyankathiru) August 22, 2019