(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇటీవల గుజరాత్ లో జనావాసాల మధ్య సింహాలు హాల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా కర్నాటకలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. శివమొగ్గ జిల్లా తిరుతాహల్లిలో అర్థరాత్రి ఓ ఇంట్లోకి చిరుత ప్రవేశించింది. ఇంటి గేటు వేసి ఉండటంతో పక్కనే ఉన్న కాంపౌడ్ వాల్ ఎక్కి ఇంట్లోకి ప్రవేశించింది. ఇంటి చుట్టూ సంచరించింది. ఆ తర్వాత అక్కడున్న ఓ కుక్కపిల్లను నోటితో కరుచుకుంటూ… మళ్లీ గోడదూకి అక్కడ్నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటన సెప్టెంబర్ 14న జరిగింది. చిరుత వచ్చిన విషయం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చంది.
#WATCH Karnataka: A leopard entered a house and took away the owner's dog in Thirthahalli of Shivamogga district, yesterday. pic.twitter.com/z7H736ax51
— ANI (@ANI) September 15, 2019
ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ఈ వీడియో తన ట్విట్టర్ పోస్టు చేసింది. దీంతో ఇప్పుడు ఈ న్యూస్ వైరల్గా మారింది. నెటిజన్లు ఈ ఘటనపై రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘చిరుతపులి ఇంట్లోకి ప్రవేశించలేదు. మానవులు చిరుతపులి నివాస స్థలంలోకి ప్రవేశించి వారి ఇంటిని నిర్మించారు’ అని ట్వీట్ చేశారు. “చాలా విచారంగా ఉంది, కానీ దాని స్వభావం” అని చాలామంది నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం గుజరాత్ రాష్ట్రంలోని జునాఘడ్ పట్టణంలో జనావాసాల మధ్య సింహాలు హాల్ చల్ చేశాయి. గిర్నార్ వణ్యప్రాణుల అభయారణ్యం ఈ పట్టణానికి సమీపంగా ఉండటంతో అడవిలోని సింహాలు పట్టణ వీధుల్లోకి చేరుకున్నాయి. గుంపులుగా సింహాలు రోడ్లపైకి రావడంతో వాహనదారులు భయంతో వణికిపోయారు. కొందరు సెల్ ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో ఆ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.