(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
రాణు మండల్.. ఇప్పుడు ఈ పేరు తెలియని వారు ఉండరు. రైల్వే స్టేషన్లో పాటలు పాడుకుంటూ, భిక్షాటన చేస్తూ జీవనం గడిపేస్తున్న ఆమె.. ఒక్కరోజులో పెద్ద సెలబ్రిటీగా మారింది. తాజాగా రాణు తన కుమార్తెతో కలిసి మహమ్మద్ రఫీ పాట పాడారు. ‘ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే చార్చే’ అని సాగే ఈ పాటను ఇద్దరూ సరగాదా ఆలపించారు. 1968లో వచ్చిన ‘బ్రహ్మచారి’ అనే సినిమాలో మహమ్మద్ రఫీ ఈ పాటను పాడారు. తాజాగా రాణు ఇదే పాటను తన కూతురు ఎలిజబెత్ సతి రాయ్ తో కలిసి పాడింది. ప్రస్తుతం ఈ పాట కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాణు మండల్ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను షేర్ చేయగా.. దాదాపు పది వేల మంది వీక్షించారు. యూట్యూబ్ లో కూడా ఈ పాట హాల్ చల్ చేస్తోంది.
https://youtu.be/qm5LDrVy2D0
సోషల్ మీడియా పుణ్యమా అని రాణు పాడిన పాట ఓ రేంజ్లో వైరల్ అయ్యింది. దీంతో నెటిజన్లు రాణు గొంతుకి ఫిదా అయ్యారు. జూనియర్ లతా మంగేష్కర్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు. కేవలం నెటిజన్లే కాకుండా బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా రాణు పాటకు మంత్ర ముగ్ధులయ్యారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు హిమేష్ రేష్మియా ఓ అడుగు ముందుకేసి `హ్యాపీ హర్డీ అండ్ హీర్`చిత్రంలో పాట పాడే అవకాశాన్ని కల్పించారు. ‘తేరీ మేరీ కహానీ’ అంటూ సాగే ఈ పాట కూడా వైరల్ అయిన సంగతి తెలిసిందే. రాణును ఆమె కూతురు వదిలేసిందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, దీనిని రాణు కూతురు ఎలిజబెత్ సతి రాయ్ ఖండించారు. తన తల్లిని వీలైనంత వరకు చూసుకుంటానని, ఆమెను తరచూ కలుస్తానని ఎలిజబెత్ పేర్కొంది.