(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఒక మహిళా రెవెన్యూ అధికారిణి మీడియాకు సమాధానం చెప్పలేక వెక్కివెక్కి ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్నూలు జిల్లా గూడురు మహిళా తహశీల్దార్ హసీనాబీ ఎసిబి ట్రాప్ ఉదంతం మరువకముందే మరో మహిళా రెవెన్యూ అధికారిణి ఎసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయింది.
పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సౌజన్యరాణి మూడు వేల రూపాయల లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కింది. ఒక మహిళ నుండి ఫ్యామిలీ సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఆర్ఐ సౌజన్యరాణి పది వేల రూపాయలు లంచం డిమాండ్ చేయగా మూడు వేల రూపాయలు ఇవ్వడానికి బాధితురాలు ఒప్పందం చేసుకుని ఎసిబి అధికారులకు ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ లంచం డబ్బులు తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకొని కేసు నమోదు చేశారు. ఈ సమయంలో ఎమి జరిగిందో తెలియజేయాలని కోరగా ఆర్ఐ వెక్కివెక్కి ఏడుస్తూ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లంచం తీసుకోవడం ఎందుకు ఇప్పుడు బాధపడటం దేనికని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.