(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
టీమిండియా ఓపెనర్లు శిఖర్ ధావన్-రోహిత్ శర్మలది అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడి. వీరు మంచి మిత్రులు కూడా. ఎప్పుడు ఒకరిపై మరొకరు జోకులు వేసుకుంటారు. తాజాగా స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు సంబంధించిన ఓ వీడియోను రోహిత్ శర్మ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. మూడో టీ20 ఈ నెల 22న బెంగళూరులో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ప్రత్యేక విమానంలో బెంగళూరుకు పయనమయ్యారు. విమానంలో వెళ్తున్న సమయంలో రోహిత్ శర్మ ఓ వీడియో తీసి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. విమానంలో ప్రయాణిస్తున్న సందర్భంగా శిఖర్ ధావన్ తనలో తానే మాట్లాడుకుంటూ వింతగా ప్రవర్తించాడు. దీనిని రోహిత్ శర్మ తన మొబైల్ తో రికార్డ్ చేశాడు. ‘శిఖర్ నాతో కాదు, కలలో తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు’ అని పేర్కొంటూ వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.
https://www.instagram.com/p/B2og1eGB7Fy/?utm_source=ig_embed
దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్లో భాగంగా రెండో టీ20లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. దాంతో సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టీ20 వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే రద్దు కాగా, రెండో టీ20లో భారత్ సమష్టిగా రాణించి విజయాన్ని అందుకుంది. రెండో టీ20లో కెప్టెన్ కోహ్లి అజేయంగా 72 పరుగులు చేయగా, శిఖర్ ధావన్ 40 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇక మూడో టీ20 బెంగళూరులో ఆదివారం జరుగనుంది. దీనిలో భాగంగా వీరు బెంగళూరుకు పయనమైంది.