(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇటలీకి చెందిన దీవి స్ట్రాంబోలీలో బుధవారం అగ్నిపర్వతం పేలింది. సిసిలీ తీరంలో ఉన్న ఈ ద్వీపంలోని అగ్నిపర్వతం పేలడం గత రెండు నెలల్లో ఇది రెండవసారి. పెలుడు సంభవించగానే ఇసుక, బూడిద, లావా పెద్ద ఎత్తున గాల్లోకి లేచింది. అగ్నిపర్వతం మీద రెండు కిలోమీటర్ల కన్నాఎత్తైన ధూళి మేఘం తయారయింది.
చాలా కిలోమీటర్ల దూరం వరకూ ఈ ధూళి మేఘం కనబడింది. సెలవులు బోటింగ్తో గడపడం కోసం వచ్చి ఆ ద్వీపం చుట్టుపక్కల బోట్లలో కాలక్షేపం చేస్తున్నవారు పేలుడు సంభవించగానే బూడిద నుంచి తప్పించుకునేందుకు హడావుడిగా దూరం వెళ్లిపోయారు. ఒక బోట్ తప్పించుకుంటున్న వీడియోను క్లాడియో మార్చియోరి అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్టు చేశారు. స్ట్రాంబోలీ దీవికి టూరిస్టులు బాగా వస్తారు. పేలుడు సంభవించినపుడు ఈ దీవిలో దాదాపు అయిదు వేల మంది టూరిస్టులు ఉన్నారు. అయితే ఎవరూ గాయపడలేదు.