నిరంకుశపు పోకడలతో అధికారం చెలాయించే ప్రభుత్వాలన్నీ కూడా తమకు ప్రత్యామ్నాయం అనేది లేదని గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటాయి. అది సర్వసాధారణమే. ఇప్పుడున్న పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. పాలకపక్షం అనుసరిస్తున్న ఈ వాస్తవాన్ని ఎవరు విమర్శించినా, అందులోని లోటుపాట్లు గురించి నోరు విప్పినా అరాచకత్వం, అసాధారణ స్థితులు, గందరగోళానికి దారితీస్తాయి.
ఇది ఎన్నికల సంవత్సరం. అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పదే పదే అదే చేస్తోంది. నరేంద్ర మోడీకి మించిన ప్రత్యామ్నాయం లేదని చెబుతోంది. రాజకీయాలకు కూడా మార్కెట్ ఉంటుందనుకుంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్లో మోడీ బ్రాండ్కు పోటీ లేదని, ఇంతకంటే విశ్వసనీయమైన, సాటిరాగల మార్గాంతరం లేదని రాజకీయ వినియోగదారులమైన మనం అందరం నమ్మి తీరాలని ప్రచారార్భాటం సాగిస్తోంది. ఇదే సురక్షితమని కూడా నమ్మబలుకుతోంది.
ఇది చాలా ప్రమాదకరమైన వాదన. ఎందుకంటే ఈ ధోరణి బలంగా వినిపించే కొద్దీ మనం మనలో ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోగలిగే విచక్షణను దెబ్బతీస్తుంది. అసలు ప్రత్యామ్నాయమే లేదనే అభిప్రాయాన్ని వ్యాపింపచేస్తుంది. వాస్తవానికి మనం అనుసరించే పద్ధతులు, ప్రయోగాలు, వైవిధ్యాలు, వైఫల్యాలలో నుంచే మనం ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకుంటాం. ఈ ప్రక్రియ ద్వారానే మనకు అన్ని విధాలా ప్రయోజనకరమైనది ఏదో దానిని గుర్తిస్తాం. ఈ అవకాశాన్ని మనకు లేకుండా చేసే పాలకపక్ష ప్రచారార్భాటం ప్రజాస్వామ్య స్వరూపానికే వ్యతిరేకం. రాజకీయాల్లో విముక్తి లక్ష్యాన్ని ఇవి దెబ్బతీస్తాయి. అంటే అనుకూలంగా లేని వాటి నుంచి మనం విముక్తి పొందే అవకాశం లేకుండా చేస్తాయి.
వ్యక్తి పక్షపాతం, మత వాదం … రెండు వద్దు
ముందుగా ఒక ప్రమాదం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా అవసరం. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఇద్దరు వ్యక్తుల్లో ఎవరో ఒకరిని ఎంపిక చేసుకోవడం కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో అయితే – పురుషాధిక్య భావనలు అత్యధికంగా ఉన్న, పనిచేయడమే అలవాటైన వర్క్ హాలిక్, మేక్ ఇన్ ఇండియా నినాదంతో చెవుల్లో ఊదరగొడుతున్న నరేంద్రమోడీ, లేదా అనుభవం ఏ మాత్రం లేని, ఏదో అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాల్లో కనిపించే రాహుల్ గాంధీలలో ఒకరిని ఎంపిక చేసుకోవడం మాత్రమే అనుకోరాదు. వార్తలనూ, సంస్కృతినీ, లేదా రాజకీయాంశాన్ని గానీ – దేన్ని అయినా సరే మార్కెట్లో పరిపూర్ణమైన అత్యుత్తమ నాణ్యత గల వస్తువుగా విపరీతంగా ప్రచారం చేయగల సామర్థ్యం ఉన్న మీడియా వారికి ఇదో పెద్ద లెక్క కాదు. అసలే అయోమయంతో, గందరగోళంలో ఉన్న వారిలో వ్యక్తి ఆరాధనకు మించిన వస్తువు మరేదీ లేదనే భావాన్ని మీడియా చాలా తేలికగా ఎక్కించగలదు.
ఇందుకు వారికి రెండు మార్గాలున్నాయి. మార్కెట్లో పరిస్థితులను దేనికదిగా విభజించి కాలనీలుగా వేరు చేయడం ఒకటి. కాగా ఒకరి పట్ల అనుకూల ధోరణులను వ్యాపింపచేస్తూ వారివైపున ప్రజాపక్షపాతాన్ని మొగ్గు చూపేలా చేయడం మరొకటి. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలు, దారి తప్పిన ఎంబీఏ గ్రాడ్యుయేట్లను ఉపయోగించుకుని ఒక వ్యక్తిని అత్యద్భుతమైన హీరో లక్షణాలు కలవాడుగా గొప్ప బ్రాండ్గా మార్కెట్ చేయిస్తాయి.
ఈ ధోరణి మనకు 2014 ఎన్నికల ముందు నుంచీ దేశంలో విపరీతంగా పెరిగిపోయింది. చాలా ఖచ్చితత్వంతో రూపొందించుకున్న మీడియా ప్రచార కార్యక్రమాలు, నైపుణ్యంతో కెమెరా వాడకం ద్వారా ఒక వ్యక్తి విశిష్టతను ప్రచారంలోకి తీసుకురావడానికి పెద్ద ఎత్తునే వ్యూహాత్మక ఎత్తుగడలు అమలులోకి వచ్చాయి. ఆ నాయకుడిలోని ప్రత్యేకతను నాటకీయ పద్ధతిలో ప్రజల ముందుకు తీసుకువచ్చారు. మోడీయే ఉత్తమ ప్రధానమంత్రి అభ్యర్థి కాగడనే విశ్వాసాన్ని సామాన్య జనాల్లో పెంపొందించారు. దేశంలో ఇలాంటి వ్యక్తిని ఇంతకుముందు ఎన్నడూ చూడలేదని ప్రచారం చేశారు. ‘పాశ్చాత్య పోకడల నీతి మాలిన’ నెహ్రూకూ, ‘అనువంశికంగా అధికారం అనుభవించిన’ ఇందిరా గాంధీకీ, ‘యాదృచ్ఛిక ప్రధాని’ మన్మోహన్ సింగ్కూ చాలా భిన్నమైన ప్రధానిగా మోదీని చిత్రించారు.
సాధారణ జనం ఎప్పుడూ తమకు ఎలాంటి అధికారం లేదనే నిస్సహాయపు ఆలోచనలతో ఉంటారు. అలాగే తాము ఎలాంటి గుర్తింపు లేని అనామకులమనే భావన ప్రబలంగా ఉంటుంది. లక్ష్య సాధకుడు, హైపర్ మాస్కులైన్ నేషనలిస్టు భావాలు విపరీతంగా ఉన్న జాతీయవాది గురించిన అసంఖ్యాక కథనాలు వారిని బాగా ఆకట్టుకుంటాయి. శత్రువు నుంచి, ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి, కాశ్మీర్ సరిహద్దుల్లో పొంచి ఉన్న ఉగ్రవాద భూతం కోరల నుంచి మనకు భద్రతనిచ్చి రక్షించగల సత్తా ఉన్న వాడనీ, అస్సాం వంటి ఈశాన్య ప్రాంతాల్లో సమస్యగా మారిన అక్రమ వలసదారుల నుంచి, గోమాత పవిత్రత గుర్తించలేని, దేశభక్తి రహిత ఉత్తరప్రదేశ్ ముస్లింల నుంచి విముక్తి కలిగించగలిగిన వాడుగా చిత్రించడం జరిగింది.
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే బాలీవుడ్ చిత్రం దీవార్లోని అమితాబ్ బచన్ పాత్రకు ఇదేమీ భిన్నమైనది కాదు. అందులో ముంబయిలోని ధారవి మురికివాడ యువకులను ఈ పాత్ర విపరీతంగా ఆకట్టుకుంది. అదే విధంగా బ్రాండెడ్ ప్రొడక్ట్గా మార్కెట్లోకి తీసుకువచ్చిన ప్యాకేజ్డ్ రాజకీయాలు కూడా అలాంటి జనాకర్షణ సూత్రంపైనే సాగుతాయని గుర్తించాలి.
ఈ కారణాల వల్లనే సరైన ప్రత్యామ్నాయం గురించి మనం తీవ్రంగా ఆలోచించాలి. వ్యక్తి పూజ ప్రాతిపదిక అయిన రాజకీయాలను మనం దూరంగా ఉంచాలి. అది మీడియా ప్రేరణతో కానీ, మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటిలో నుంచి ఏదో ఒక దానిని ఎంచుకునేందుకు ప్రయత్నించకూడదు. రాజకీయాలను సాధారణ మార్కెట్ వస్తువు అనుకోరాదు. అధికార బలాన్ని అప్పగించడానికి అనువైన నిర్మాణాత్మక సాధనంగా గుర్తించాలి. సామాజిక భద్రత, ఆర్థిక వికేంద్రీకరణ, భూ సంస్కరణలు, సమన్యాయానికి సంబంధించిన ఆలోచనలూ, ఏక వ్యక్తి నాయకత్వం, కుల రాజకీయాల పోకడలను వ్యతిరేకించాల్సిన అవసరం దృష్టిలో ఉంచుకుని నిర్ణయించుకోవాలి. మనలో ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములు కావాలి. ప్రతి వారూ తమ గొంతు విప్పాలి. మనం కేవలం వినియోగదారులం కాదు. నిర్మాణ సామర్థ్యం ఉన్న విచక్షణాపరులం. ఇది గుర్తించాలి. అలా ఆలోచించగలిగితే ఇలాంటి వ్యక్తిపూజ ధోరణులకు చోటు ఉండదు. మనకు కావలసింది మాయ చేయగల మేజీషియన్లు కాదు. అలాగని నిరంకుశపు పోకడలు ఉన్న వారూ కాదు. సంప్రదింపులకు అవకాశం ఇచ్చే సౌమ్యవాదులు అవసరం. ప్రజల పట్ల వినయవిధేయతలు ఉన్న వ్యక్తులు కావాలి. వారితో మమేకం కాగలిగిన వారై ఉండాలి.
ఇదే సమయంలో మరో ప్రమాదం గురించి జాగ్రత్త పడాలి. అధికారంలో ఉన్న వారు దేశభక్తి పేరుతో చేసే హెచ్చరికలు. పాలక పక్షానికి వ్యతిరేకంగా ఉండడం అంటే దేశద్రోహంతో సమానం అంటారు వారు. ఇది దేశభక్తి అనేది కొందరి గుత్త సొత్తు అనడం లాంటిది. దేశ మహోన్నత చరిత్రనూ, ప్రాచీన సంస్కృతీ వారసత్వ సంపదనూ దృష్టిలో ఉంచుకుని హిందుత్వ, మతపరమైన జాతీయత వాదాలను వ్యతిరేకించాలి. మోడీ బ్రాండ్ ప్రచారం చేసే దేశభక్తి విజ్ఞత పరంగా బలహీనమైనది. సంస్కృతికంగా హీనమైనది. ఆధ్యాత్మికంగా దివాలా తీసినది.
జాతీయవాదపు తీవ్రవాదం కాదు మనకు కావల్సింది. లేదా దానిని ప్రతిబింబించే బాహ్యాడంబరాలూ కాదు. ఠాగూర్ గోరా నవలలో చిత్రించిన మాతృమూర్తి ఆనందమాయి లాంటి దేశం మనకు కావాలి. కలుపుకుని వెళ్లడం కావాలి. అంతేకాని బయటకు గెంటివేయడం కాదు. సంప్రదింపులకు ఆస్కారం ఉండాలి. అంతేకానీ ఒకరి మాటకే అందరూ తలూపే తీరు కాదు. ఏకాధిపత్యం కాదు. అందరికీ అవకాశం ఉండే బహుళత్వం కావాలి. అంతిమంగా ప్రజాపాలన కావాలి. అంతేకానీ సైనిక బలాన్ని చూపించే క్రౌర్యం కాదు. అదే మన నూతన రాజకీయ ప్రత్యామ్నాయానికి ఆలంబన కావాలి.
ప్రత్యామ్నాయం ఎప్పుడూ దోషరహితంగా ఉండలేదు
ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఏ ప్రత్యామ్నాయమైనా పరిపూర్ణంగా అత్యుత్తమమైనది కాజాలదు. ఎందుకంటే అంతటి పరిపూర్ణ ప్రత్యామ్నాయం ఉన్నట్టుండి ఆకాశం నుంచి కిందకు దిగిరాదు. ఎన్నో వైరుధ్యాలు ఉంటాయి. ఎన్నో వైఫల్యాలు కూడా ఉంటాయి. ఈ సవాళ్లను ఎదుర్కోవాలి. అప్పుడే నూతన ఆరంభం సాధ్యమవుతుంది. ఇప్పుడున్న స్థితిలో మన దేశంలోని ప్రతిపక్షాలకు ఇలాంటి ప్రత్యామ్నాయం వైపు అడుగు వేసే అవకాశం ఉన్నదా అనేది పెద్ద ప్రశ్న.
సాధ్యమే. అయితే ముందుగా రెండు ప్రశ్నలకు మనం సమాధానం చెప్పగలగాలి. అందులో మొదటిది – ఇప్పుడున్న ఎన్నిల విధానం. ధనబలం, కండబలం ప్రభావం ఎక్కువగా ఉంటున్న విధానం ఇది. అందువల్ల నిజాయితీ గల వ్యక్తులు పోటీకి ముందుకు రాలేకపోతున్నారు. అందుకే ఎమ్మెల్యేల ఫిరాయింపులను మనం చూస్తున్నాం. ఏ పార్టీకి చెందిన వారైనా సరే, అసెంబ్లీలో ఏ ఒక్క పార్టీకీ బలం లేని పక్షంలో, సంతలో వస్తువుల్లా అమ్మకానికి సిద్ధమైపోతున్నారు. వారిని కాపాడుకునేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్న రిసార్టుల్లో ఉంచి కాపాడుకోవలసి వస్తోంది. ఇది చాలా దారుణం. ప్రజాభిప్రాయాన్ని మురికికాలవ పాలు చేయడమే. మరో ప్రశ్న – ఏ మార్గంలో అయినా సరే గెలవడమే ముఖ్యమనే రాజకీయాల అంతిమ లక్ష్యం. ఇందుకు అందుబాటులో ఉన్న అన్ని అడ్డదారులను నిస్సిగ్గుగా అనుసరించేందుకు సిద్ధమైపోతున్న దౌర్భాగ్యం. సాధారణంగా ఇటీవల కాలంలో ఎన్నికల్లో అభ్యర్థును ఎంపిక చేసుకోవసి వస్తే అన్ని పార్టీలూ ఒకే సూత్రం అనుసరిస్తున్నాయి. అయితే రియల్ ఎస్టేట్ మాఫియాకు చెందిన వాడై ఉండాలి. లేదా స్థానికంగా జనాన్ని బెదిరించగల గూండా అయి ఉండాలి. లేదా శక్తివంతమైన మంత్రికి కోడలు అయి ఉండాలి. ఇలాంటి అభ్యర్థులు మనకు వద్దు గాక వద్దు.
ఒక రకంగా చెప్పాలంటే మనకు రాజకీయ పార్టీలపై పట్టు పూర్తిగా చేజారిపోయింది. ఎంతసేపూ మనం ఉన్న వాటిలో తక్కువ హాని చేయగల వాటినే ఎంపికచేసుకుంటున్నాం. అందుకు అలవాటు పడిపోయాం. ఈ క్రమంలో ప్రాథమికంగా పరిశీలించవలసిన అంశాలను మరచిపోయాం. మనకు వార్తాపత్రిక సంపాదకీయాల్లో విస్తృతంగా చర్చకు వచ్చే ఆకర్షణీయమైన వివాదాలపైనే దృష్టి ఉంటుంది. అత్యాశ గల మాయావతి వేసిన రాజకీయపు ఎత్తుగడ అంటే మాస్టర్ స్ట్రోక్ మంచిదా ? యోగి ఆదిత్యనాథ్ మత రాజకీయాలు మంచివా? అమిత్ షా ఎత్తుకు పై ఎత్తు వేసిన మమతా బెనర్జీ దూకుడు మంచిదా? లేక కంచుకోటలాంటి మోడీ నుంచి ఎదురయ్యే వాటికి కౌగిలింతతో సమాధానం చెప్పాననుకున్న రాహుల్ గాంధీ ప్రత్యేకమైన వాడా?
పార్టీ ప్రభావం అధికంగా ఉన్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య రాజకీయాల్లో అంతరాంతరాల్లో ఉన్న అతి పెద్ద దోషం ఇదే. త్వరలో జరగనున్న ఎన్నికల్లో మనం అందరం పాలు పంచుకుంటున్నాం కదా. ఈ ఎన్నికల్లో మన దృష్టిని సరైన ప్రత్యామ్నాయం ఎంచుకునేందుకే ఉపయోగించుకోవాలి. అది అన్ని విధాలా పరిపూర్ణమైనది కానక్కరలేదు. ఎందుకంటే ఇప్పుడున్న అస్తవ్యస్త పరిస్థితులను మనం ఎలాగూ భరిస్తూనే ఉన్నాం. మరెక్కడా కనిపించని వైవిధ్యంలో భిన్నత్వం మన దేశానికే సొంతం. సరైన ప్రత్యామ్నాయం ఎంచుకోలేక పోతే అలాంటి దేశం నాశనం అవుతుంది, ఆదానీలు, అంబానీలు మాత్రం పెరుగుతూనే ఉంటారు. ఈ దేశంలో భాగమైన చేతివృత్తుల వారూ, రైతులూ, కార్మికులూ, కూలీలూ, పేదలూ, దళితులూ, గిరిజనులూ…వీరందరూ ఆర్ధిక అభద్రత, నిరుద్యోగం, సాంస్కృతిక వివక్ష తాలూకూ భయంకరమైన అనుభవాలు ఎదుర్కొంటూనే ఉంటారు.
చివరిగా … విప్లవాత్మకమైన ప్రత్యామ్నాయం ఎంపిక అంతం ఎన్నికలు కాదు. అది నిరంతర ప్రక్రియ.
-అభిజిత్ పాఠక్
రచయిత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో
సోషియాలజీ ప్రొఫెసర్
‘ద వైర్’ వెబ్సైట్ సౌజన్యంతో
This post was last modified on January 27, 2019 7:29 pm
Satyadev: వెర్సటైల్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నత్తించిన తాజా చిత్రం కృష్ణమ్మ. ఈ సినిమాకు వీవీ గోపాలకృష్ణ దర్శకత్వం వహించిన… Read More
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ 35వ పుట్టినరోజు సందర్భంగా నేడు అనగా మే 9న సోషల్ మీడియా మొత్తం ఆయన… Read More
Today OTT Releases: తెలుగు రాష్ట్రాల్లో అనేక ఓటిటి ప్లాట్ ఫారం అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఇంగ్లీష్ మరియు హిందీ,… Read More
YS Jagan: బ్రిటన్, స్విట్టర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు విదేశాలకు వెళ్లేందుకు బెయిల్ షరతులను సడలించాలని… Read More
This week OTT Releases: ప్రతి వీకెండ్ అనేక సినిమాలు అనేక జోనర్లలో ఓటీటీలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే… Read More
OTT: మలయాల్ క్రైమ్ కామెడీ యాక్షన్ మూవీ ఆవేశం ఓటీడీలోకి రానే వచ్చింది. స్టార్ హీరో ఫహిద్ ఫాజిల్ ప్రధాన… Read More
AP High Court: రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వ పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ… Read More
Congress: విజయవాడ జింఖానా గ్రౌండ్స్లో రేపు (10వ తేదీ) సాయంత్రం 5 గంటలకు ఇండియా కూటమి సభ జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ… Read More
YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని… Read More
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ నకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్… Read More
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ డం సంపాదించుకున్న ఏకైక ముద్దుగుమ్మ జ్యోతి… Read More
Television Couple: ప్రజెంట్ జనరేషన్ మొత్తం పెళ్లి మరియు పిల్లలు అంటూ బిజీగా తమ లైఫ్ని సాగిస్తున్నారు. ఇక ఇదే… Read More
Anchor Shyamala: మొదట సీరియల్స్ లో నటించి అనంతరం సినిమాస్లో మరియు ఇతర రంగాల్లో రాణిస్తూ మంచి పేరు ప్రఖ్యాతలు… Read More
Kadiyam Kavya: తమ కులంపై జరుగుతున్న చర్చపై వరంగల్లు లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి కడియం కావ్య సీరియస్ కామెంట్స్ చేశారు.… Read More
Dimple Kapadia: సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకోవాలంటే అది కొంతమందికి మాత్రమే… Read More