YS Sharmila: కడప లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పులివెందులలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. ఎంపిగా అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క ఉద్యమం కూడా చేయలేదని విమర్శించారు. హత్యలు చేయడానికే అధికారాన్ని వాడుకుంటున్నారని అన్నారు. అవినాష్ రెడ్డి నిందితుడు అని సీబీఐ చేసిన ఆరోపణల ప్రకారమే మాట్లాడుతున్నామనీ, కాల్ రికార్డ్సు, గూగుల్ మ్యాప్స్ వంటి ఆధారాలన్నీ ఉన్నాయన్నారు.
బాబాయిని చంపిన హంతకులనే సీఎం కాపాడుతున్నారని అన్నారు. జగన్ కు అధికారం ఇచ్చింది ఆయన్ను కాపాడటానికా అని ప్రశ్నించారు. ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశాననీ, ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డానని అన్నారు. న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొందని అన్నారు. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరారు.
వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత మాట్లాడుతూ.. తన తండ్రిని దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం కోసం అయిదేళ్లుగా పోరాడుతున్నానని అన్నారు. ఈ పోరాటంలో కోర్టు తీర్పు చాలా ఆలస్యం కావొచ్చని, ప్రజా తీర్పు పెద్దదని అన్నారు. దాని కోసం షర్మిల ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారని చెప్పారు. రేపో మాపో అవినాష్ రెడ్డి జైల్ కు వెళతారని అన్నారు. జైలుకు పోయే వారు కాదు.. జనాల్లో ఉండే వాళ్లు గెలవాలన్నారు. షర్మిలను గెలిపించి వివేకా ఆత్మకు శాంతి కల్గించాలని కోరారు.