Breaking: దేశ రాజధాని ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని రేపింది. ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతంలోని పలు ప్రముఖ పాఠశాలలకు ఇ మెయిల్ ద్వారా బెదిరింపు హెచ్చరికలు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాయి. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలలను ఖాళీ చేయించారు. పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు.
ఢిల్లీలోని ద్వారక, చాణక్యపురి, మయూర్ విహార్, వసంత్ కుంజ్, సాకేత్ తో పాటు నోయిడాలోని సుమారు 12 పాఠశాలలకు ఈ మెయిల్ వచ్చినట్లు తెలుస్తొంది. పలు పాఠశాలల్లో ఇవేళ పరీక్షలు జరుగుతున్నాయి. బెదిరింపుల నేఫథ్యంలో వాటిని మధ్యలోనే ఆపి విద్యార్ధులను ఇంటికి పంపించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆయా స్కూళ్లకు చేరుకుని వారి పిల్లలను తీసుకువెళ్లారు.
పోలీసులు బాంబ్ డిటెక్షన్ బృందంతో ప్రస్తుతం పాఠశాలల ప్రాంగణాల్లో తనిఖీలు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడకు చేరుకునారు. ఇప్పటి వరకూ ఎలాంటి అనుమానాస్పద, పేలుడు పదార్ధాలు లభించలేదని తెలుస్తొంది. బెదిరింపులకు పాల్పడిన ఈ – మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మెయిల్ ఐపీ అడ్రస్ లను బట్టి విదేశాల నుండి దీన్ని పంపినట్లుగా ప్రాధమిక దర్యాప్తులో తేలింది. ఒకే వ్యక్తి నుండి ఈ బెదిరింపులు వచ్చి ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు.
అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఇదే తరహాలో ఢిల్లీలోని పాఠశాలలకు బెదిరింపులు వచ్చాయి. పోలీసులు నాడు తనిఖీలు జరపగా ఎలాంటి పేలుడు పదార్ధాలు లభించలేదు. దీంతో నకిలీ బెదిరింపు లు అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ