Chandrababu: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ కూటమిలో ఉన్న జనసేన ఇప్పటికే టీడీపీతో పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకుంది. 2018లో ఎన్డీఏ నుండి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు కేంద్రంలోని బీజేపీపై, మోడీ, షా పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. దీంతో కేంద్రంలోని బీజేపీ పెద్దలు 2019 ఎన్నికల్లో పరోక్షంగా వైసీపీకి సహకరించారు అనేది అందరికీ తెలిసిందే.
చంద్రబాబుకు ఎన్డీఏ డోర్స్ క్లోజ్ చేసినట్లుగా కూడా అమిత్ షా బాహాటంగానే ప్రకటించారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత, జగన్ కు అటు కేసిఆర్, కేంద్ర బీజేపీ పెద్దల మద్దతు, జగన్ పై సానుభూతి, తదితర కారణాలతో 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. టీడీపీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అప్పటికి తత్వం బోధపడిన చంద్రబాబు..మరల కేంద్రంలోని బీజేపీ పెద్దల ప్రాపకం కోసం ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చారు. కానీ వారు దూరం పెడుతూనే వచ్చారు.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బేషరతుగా ఎన్డీఏ అభ్యర్ధులకు టీడీపీ మద్దతు ఇచ్చింది. అనేక సార్లు ప్రయత్నాలు చేస్తే నాలుగైదు నెలల క్రితం చంద్రబాబుకు అమిత్ షా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఢిల్లీకి వెళ్లి అమిత్ షా, జేపీ నడ్డాతో సమావేశమైయ్యారు చంద్రబాబు. అయితే వారి మధ్య ఎటువంటి చర్చలు జరిగాయి అనేది మాత్రం బయటకు రాలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశానికి చంద్రబాబుకు అహ్వానం రాలేదు. పవన్ కళ్యాణ్ కు మాత్రం ఆహ్వానం రాగా ఆయన ఎన్డీఏ పక్షాల సమావేశానికి వెళ్లారు. దీంతో చంద్రబాబును బీజేపీ పక్కన పెట్టినట్లేనని ప్రచారం జరిగింది.
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నా కేంద్రంలోని బీజేపీ నుండి ఇటీవల కాలం వరకూ ఎటువంటి సంకేతాలు రాకపోవడంతో జనసేన – టీడీపీ కూటమితోనే ఎన్నికలకు వెళ్లాలని రెండు పార్టీలు నిర్ణయించుకున్నాయి. ఆ క్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సీట్ల సర్దుబాటు చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటుంది. గత ఎన్నికల్లో మాదిరిగా వైసీపీకి పరోక్షంగా సహకరిస్తుందా .. లేక 2014 ఎన్నికల్లో మాదిరిగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా లేదా అనే అనుమానాలు ఏపీ ప్రజల్లో, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.
ఈ తరుణంలో బీజేపీతో పొత్తుపై చర్చించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి వెళుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. బీజేపీ పెద్దల నుండి వచ్చిన అహ్వానంతో ఇవేళ (బుధవారం) చంద్రబాబు ఢిల్లీకి వెళుతున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుండి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బయలుదేరి చంద్రబాబు ఢిల్లీకి వెళ్తారు. ఈ రాత్రి లేదా హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ కానున్నారు. అవసరం అయితే చంద్రబాబు రాష్ట్రానికి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళతారు అని అంటున్నారు.
ఢిల్లీకి పయనమవుతున్న నేపథ్యంలో ఇవేళ ఉదయం చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలతో బీజేపీతో పొత్తు అంశంపై చర్చించి అభిప్రాయాలు తెలుసుకున్నట్లు తెలుస్తొంది. బీజేపీతో టీడీపీ – జనసేన పొత్తుపై ఇవేళ ప్రాధమికంగా చర్చలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెల 13,14, 15 తేదీల్లో పొత్తులపై ఉమ్మడి ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు, సీట్లు లేకపోయినా కేంద్రంలోని బీజేపీ పెద్దల అండకోసమో చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం.
పొత్తులో భాగంగా బీజేపీ పెద్దలు ఎక్కువ పార్లమెంట్ స్థానాలు డిమాండ్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు ఉంటుందా లేదా అనే దానిపై క్లారిటీ రావాలంటే మరో రెండు మూడు రోజులు వేచి చూడాల్సిందే. బీజేపీతో పలు మార్లు దోస్తీ కటీఫ్ చెప్పి మళ్లీ మళ్లీ స్నేహహస్తం అందుకుంటున్న వాళ్లలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తర్వాతి వరుసలో చంద్రబాబు ఉంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.