Supreme Court: సార్వత్రిక ఎన్నికల వేళ సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట లభించింది. ఈవీఎం – వీవీప్యాట్ క్రాస్ వెరిఫికేషన్ వ్యవహారంపై సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో (ఈవీఎం) నమోదైన ఓట్లతో వంద శాతం వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలన్న పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ మేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఒకే అభిప్రాయంతో రెండు తీర్పులు వెలవరించింది.
ఈ పిటిషన్ లపై ఇటీవల సుప్రీంకోర్టులో విస్తృతంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రోటోకాల్ లు, సాంకేతిక అంశాలపై ఎన్నికల సంఘానికి ధర్మాసనం పలు ప్రశ్నలను సందించింది. ఈసీ నుండి సమగ్ర వివరణ తీసుకుంది. అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన ధర్మాసనం .. పేపర్ బ్యాలెట్ ఓటింగ్ డిమాండ్లు సహా అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.
ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి పలు ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలో సింబల్ లోడింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆ యూనిట్ ను సీల్ చేయాలని తెలిపింది. దాన్ని కనీసం 45 రోజుల పాటు భద్రపరచాలని సూచించింది. పలితాల విడుదల తర్వాత అభ్యర్ధులు ఏడు రోజుల్లోపు తమ అభ్యంతరాలను తెలియజేయాలని పేర్కొంది. అప్పుడు ఇంజనీర్ల బృందం మైక్రో కంట్రోలర్ ఈవీఎంలో బర్న్ చేసిన మెమోరీని తనిఖీ చేయాలని తెలిపింది. ఈ వెరిఫికేషన్ కు అయ్యే ఖర్చులను అభ్యంతరాలు లేవనెత్తిన అభ్యర్ధులే భరించాలని వెల్లడించింది. ఒక వేళ ఈవీఎం ట్యాంపర్ అయినట్లు తేలితే ..ఖర్చులు తిరిగి ఇవ్వాలని సూచించింది.
ఈ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యవస్థను గుడ్డిగా అపనమ్మకంతో చూడటం..అనవసర అనుమానాలకు దారి తీస్తుందని అభిప్రాయపడ్డారు. ఇక కౌంటింగ్ సమయంలో పేపర్ స్లిప్ లను లెక్కించేందుకు ఎలక్ట్రానిక్ మెషిన్ ను ఉపయోగించాలన్న పిటిషనర్ల సూచనను పరిశీలించాలని జస్టిస్ ఖన్నా ఈసీకి తెలిపారు. అంతే కాకుండా ప్రతి పార్టీ పక్కన గుర్తుతో పాటు బార్ కోడ్ కూడా ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.
ప్రస్తుతం ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో అయిదు ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వెరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం స్లిప్పులను సరిపోల్చాలని పిటిషనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈసీ మాత్రం అది సులభం కాదని ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని కోర్టుకు వివరించింది.
TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా