BRS MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. సీబీఐ అరెస్టు వ్యవహారంలో ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితను తొలుత ఈడీ అరెస్టు చేసింది. ఆ తర్వాత సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
దీంతో ఈడీ, సీబీఐ అరెస్టులపై బెయిల్ కోరుతూ కవిత తరపున న్యాయవాదులు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్ లపై వాదనలు పూర్తి కాగా, సీబీఐ అరెస్టు వ్యవహారంపై ఆమె వేసిన పిటిషన్ తీర్పు ఇవేళ వెలువడాల్సి ఉంది. అయితే ఈ తీర్పూను మే 6వ తేదీకి వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక కోర్టు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఒకే రోజు వేర్వేరుగా తీర్పులు ఇస్తామని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా తెలిపారు.
లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని, కావున బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంలో కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ కేసులో కవిత ప్రధాన కుట్రదారు అని సీబీఐ పేర్కొంది. ఆమె బయటకు వస్తే సాక్ష్యాలను ద్వంసం చేసే అవకాశం ఉందని, సాక్ష్యులను బెదిరించే అవకాశం ఉందని పేర్కొంది. మరో వైపు ఈ కేసు రాజకీయ కక్షతో మాత్రమే పెట్టారని కవిత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు లేవని, కేవలం అప్రూవర్ లు ఇచ్చిన స్టేట్ మెంట్ ల ఆధారంగా చేసుకుని అరెస్టు చేశారని తెలిపారు.
కవితను ఈడీ అధికారులు మార్చి 15వ తేదీన అరెస్టు చేశారు. తర్వాత తీహార్ జైలులో ఉన్న కవితను అదే కేసులో సీబీఐ అరెస్టు చేసింది. సీబీఐ, ఈడీ రెండు కేసుల్లోనూ బెయిల్ పిటిషన్ పై ఈ నెల 6వ తేదీన తీర్పు వెల్లడి కానుండటంతో తీర్పు ఎలా ఉంటుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.