Telangana Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో అభ్యర్ధుల ఎంపికపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత అధికారాన్ని కైవశం చేసుకున్న కాంగ్రెస్ .. ఈ సారి ఎలాగైనా అత్యధిక లోక్ సభ స్థానాలూ కైవశం చేసుకుని తమ సత్తా నిరూపించుకోవాలని భావిస్తుంది. ఈ క్రమంలో పార్టీ అధిష్టానం పూర్తి స్థాయి కసరత్తు చేస్తూ గెలుపు గుర్రాలను అభ్యర్ధులుగా ఎంపిక చేస్తొంది.
మొత్తం 17 లోక్ సభ స్థానాలకు గానూ ఇప్పటికే పలు విడతలుగా 14 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్.. మూడు స్థానాలను పెండింగ్ లో పెట్టింది. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం ఎంపీ టికెట్ల విషయమై పార్టీ లో తీవ్ర పోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఊపును కొనసాగించాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి ..చేరికలపై దృష్టి పెట్టారు. ఆ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీలోని పలువురు కీలక నేతలను పార్టీలోకి చేర్చుకుని లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులుగానూ ఎంపిక చేశారు.
పెండింగ్ లో ఉన్న మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్ధుల ఎంపికపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళుతున్నారు. రేపు (శుక్రవారం) కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో లోక్ సభ అభ్యర్దులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ ఉండనుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో పెండింగ్ లో ఉన్న ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ ఎంపీ టికెట్ల పై చర్చించి ఖరారు చేయనున్నారు. ఈ వేళ సీఎం రేవంత్ రెడ్డి మరో మారు ఢిల్లీ వెళుతుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇదిలా ఉండగా..అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ స్వీప్ చేసింది. ఒక్క భద్రచాలం అసెంబ్లీ స్థానం మినహా తొమ్మిది అసెంబ్లీ సిగ్మెంట్ లలో కాంగ్రెస్ అభ్యర్ధులే గెలిచారు. తాజాగా భద్రాచలం నుండి గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. ఖమ్మం లోక్ సభ స్థానం కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకోవడం ఖాయమన్న మాట స్పష్టంగా వినబడుతోంది. ఇక్కడ ముగ్గురు మంత్రుల తాలూకు కుటుంబ సభ్యులు అభ్యర్ధిత్వం కోసం పోటీ పడుతుండటంతో అధిష్టానానికి పెద్ద తలనొప్పిగా మారింది.
ఖమ్మం ఎంపీ టిక్కెట్ ను డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ లు ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురు మంత్రులలో టిక్కెట్ దక్కించుకునేది ఎవరు అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తొంది. మరో పక్క ముగ్గురు మంత్రుల కుటుంబాలను కాదని కొత్త వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉందనే చర్చ కూడా నడుస్తొంది. మంత్రుల కుటుంబాలకు చెందిన వారు కాకుండా ఖమ్మం టిక్కెట్ రేసులో రాయల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు, కుసుమ కుమార్ ఉన్నట్లుగా తెలుస్తొంది.
ఇక, కరీంనగర్ ఎంపీ టిక్కెట్ కోసం ప్రవీణ్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ టిక్కెట్ ను త్యాగం చేసిన సమయంలో పార్టీ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో తనకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రవీణ్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. మరో పక్క కరీంనగర్ టిక్కెట్ రేసులో వెలిచాల రాజేంద్ర రావు, తీన్మార్ మల్లన్న కూడా ఉన్నారు. అయితే ఈ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో వెలమ సామాజిక వర్గానికి పట్టు ఉన్న కారణంగా ఈ సామాజికవర్గ నేతకు టిక్కెట్ ఖరారు చేయాలన్న డిమాండ్ ప్రముఖంగా వినబడుతోంది.
మరో వైపు హైదరాబాద్ ఎంపీ స్థానం విషయంలోనూ స్పష్టత రాలేదు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఎంపీ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా సానియా మీర్జా పోటీ చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ దీనిపై పార్టీ నేతలు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. దీంతో ఇక్కడ కూడా ఎవరు బరిలో నిలుస్తారు అనేది వేచి చూడాలి.
Chandrababu: జగన్ అధికారాన్ని దించేందుకు మూడు పార్టీల కలయిక – చంద్రబాబు