AP Elections 2024: ఏపీ ఎన్నికలకు టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం విడుదల చేశారు. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలిసి దీన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జి సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. తెలుగు జాతికి పూర్వ వైభవం తీసుకురావాలన్న లక్ష్యంతోనే మూడు పార్టీలు కూటమిగా జట్టు కట్టాయని చంద్రబాబు తెలిపారు.
రాష్ట్రాన్ని కాపాడటమే తమ లక్ష్యమని అన్నారు చంద్రబాబు. పేదల సంక్షేమం కోసం సూపర్ సిక్స్ పథకాలతో ముందుకొచ్చినట్లు చెప్పారు. ఎన్డీఏ జాతీయ స్థాయిలో మ్యానిఫెస్టో విడుదల చేసిందని అందుకే టీడీపీ, జనసేన కలిసి మ్యానిఫెస్టో తయారు చేశామన్నారు చంద్రబాబు. ఇందుకు బీజేపీ కూడా కొన్ని సూచనలు చేసిందన్నారు. అందువల్ల బీజేపీ కూడా ఈ మ్యానిఫెస్టో ను ఎండార్స్ చేసిందన్నారు. బీజేపీ సహకారం రాష్ట్రంలో కూటమికి ఉంటుందని అన్నారు. అందుకే సిద్ధార్ధ నాథ్ సింగ్ నేరుగా వచ్చి మ్యానిఫెస్టో విడుదలలో పాల్గొన్నారని అని చంద్రబాబు పేర్కొన్నారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ .. రేపటి ఆకాంక్షలను సాకారం చేసే విధంగా మ్యానిఫెస్టోను రూపొందించినట్లు తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉందని అన్నారు. ప్రస్తుత వైసీపీ పోలవరం ప్రాజెక్టును గోదావరిలో ముంచారని, ప్రజా రాజధాని అమరావతిని విధ్వంసం చేశారని విమర్శించారు. వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశారన్నారు. లక్షలాది ఎకరాల ప్రజల ఆస్తులు కబ్జా చేశారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థలకు కేంద్రం ఇచ్చిన రూ.12 వేల కోట్ల మళ్లించారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు, విధ్వంస పాలనకు సాగనంపేందుకు కూటమి ముందుకు వచ్చిందని తెలిపారు.
18 నుండి 59 ఏళ్ల ఉన్న మహిళలకు 1,500 రూపాయలు పింఛను ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద ఎంత మంది ఉన్నా ఒక్కొక్కరికి రూ.15వేలు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల భృతిని అందచేస్తామని తెలిపారు. మెగా డీఎస్సీపై తొలి సంతకం పెడతానని తెలిపారు. చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలను అందిస్తామని తెలిపారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. దీపం పథకం కింద మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందచేస్తామని తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందచేస్తామని తెలిపారు.
పింఛన్ రూ.4వేలు అందచేస్తామని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు ఏటా అందచేస్తామని చెప్పారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనను పంపుతామని చెప్పారు. మత్స్యకారులకు ఏటా ఇరవై వేల రూపాయలు అందచేస్తామన్నారు. చెత్త పన్ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. మద్యం ధరలను నియంత్రించడమే కాకుండా విషపూరిత బ్రాండ్లను కాకుండా నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని తెలిపారు. అన్నా క్యాంటిన్లు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఆదరణ కింద బీసీల అభివృద్ధి కోసం ఐదు వేల కోట్ల రూపాయలు అందచేస్తామని తెలిపారు. కన్యాకపరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామని తెలిపారు. ఎయిడెడ్ కళాశాలలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ ను పునరుద్ధరిస్తామని చెప్పారు. రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. బీసీల స్వయం ఉపాధి కోసం ఏటా పది వేల కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. పవర్ లూమ్స్ కు రెండు వందల యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్తును అందిస్తామని తెలిపారు. కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇస్తామని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తామని తెలిపారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ కు నిధులు కేటాయిస్తామని తెలిపారు.
యువతకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. బీసీలకు యాభై ఏళ్లకే పింఛను వచ్చేలా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆధునిక పనిముట్లతో ఆదరణ ను అమలు చేస్తామని చెప్పారు. డాక్వా మహిళలకు పది లక్షల వరకూ వడ్డీ లేని రుణాలను అందిస్తామని తెలిపారు. ఆలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25వేల గౌరవ వేతనం ఇస్తామని చెప్పారు. బార్బర్ షాపులకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. పోలవరాన్ని పూర్తి చేస్తామని, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి సాగునీరు అందిస్తామని తెలిపారు. ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందచేస్తామని చంద్రబాబు తెలిపారు. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకు వస్తామని తెలిపారు. పూర్తి దివ్యాంగులకు రూ.15వేలు పెన్షన్ ఇస్తామని తెలిపారు. కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘ కాలిక వ్యాధి గ్రస్తులకు రూ.10వేల పింఛన్ అందిస్తామని పేర్కొన్నారు.
Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన