వచ్చే ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీ సీటును దక్కించుకునేందుకు వైసీపీ శత విధాల ప్రయత్నిస్తోంది. అయితే.. ప్రస్తుతం వచ్చిన రెండు మూడు సర్వేల్లో విశాఖ పరిస్థితి వైసీపీకి అంత అనుకూలంగా లేదని తేలిపోయింది. దీనికి ప్రధానంగా స్థానిక పరిస్థితులేనన్నది సర్వేల్లో పాల్గొన్న ప్రజలు అభిప్రాయపడుతు న్నారు. వాస్తవానికి విశాఖను రాజధానిగా ప్రకటించిన తర్వాత.. ఆ విషయాన్ని భారీగానే ప్రమోట్ చేశారు. అయితే.. ఈ సింపతీ స్థానికంగా కనిపించడం లేదని సర్వేల్లో స్పష్టమైంది.
సిట్టింగ్ ఎంపీ కుటుంబం కిడ్నాప్ శాంతి భద్రతలపై ప్రభావం చూపించగా, ఎంపీ రియల్ ఎస్టేట్ వ్యాపారా లకే పరిమితం అయ్యారని.. కనీసం ఐదేళ్ల కాలంలో ఐదు నిమిషాలు కూడా తమకు కేటాయించలేదన్న వాదన ప్రజల నుంచి వినిపిస్తోంది. దీంతో వైసీపీ ప్రకటిత విశాఖ రాజధాని వాదం తెరమరుగైంది. మరోవైపు.. వచ్చే ఎన్నికల్లో మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి బరిలోకి దిగుతున్నారు. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఈ కుటుంబానికి అపారమైన అనుభవం ఉంది.
ఆర్థిక, అంగ బలం కలిగిన నేత కావడంతో బొత్సకు అంతే ప్రాధాన్యత దక్కుతోంది. ఈ క్రమంలోనే బొత్స భార్యను విశాఖ పార్లమెంట్ స్థానానికి వైసీపీ అధిష్టానం పరిగణనలోకి తీసుకుని ఖరారు చేసింది. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చెబుతున్న విశాఖకు సీఎం భవిష్యత్లో రావాలంటే ఇక్కడి స్థానాన్ని వైసీపీ తప్పక గెలవాలనేది పార్టీ అంచనా. అప్పుడే ఇక్కడి ప్రజలు ఎగిక్యూటివ్ క్యాపిటల్ను స్వాగతిస్తున్నారని చెప్పేందుకు వీలుంటుంది.
ఇతర అభ్యర్థులతో పోలిస్తే బొత్స ఝాన్సీ బలమైన అభ్యర్థిగా అధిష్టానం భావించడం వల్లే ఆమె పేరును ప్రకటించారు. బొత్స ఝాన్సీ విజయం అధిష్టానానికి ఎంత కీలకమో.. ఈ ప్రాంతానికి సీనియర్ నేతగా ఉన్న బొత్సకు అంతే కీలకం. అందుకే బొత్స విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గా లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి నియోజకవర్గంలోనూ బలమైన నేతలు ఉండడంతో ఆయన కూడా విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. కానీ, సర్వేలు మాత్రం ప్రజానాడిని వైసీపీకి వ్యతిరేకంగా ఉందని స్పష్టం చేస్తుండడం గమనార్హం.