ఏపీ అధికార పార్టీ వైసీపీకి ప్రమాద ఘంటికలు మోగిస్తూ.. తాజాగా ఓ సర్వే వెల్లడైంది. వచ్చే ఎన్నికల్లో వైనాట్ 175 నినాదంతో దూసుకుపోతున్న అధికార పార్టీకి ప్రజలు బ్రేకులు వేయనున్నారనేది ఈ సర్వే సారాంశం. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల విషయంలో వైసీపీ సాధించిన ప్రగతి ఏమీ కనిపించడం లేదనే భావన సర్వత్రా వినిపిస్తోంది. 22 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ.. కేంద్రం నుంచి డిమాండ్ చేసి తెచ్చినది అంటూ ఏమీ లేకపోవడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
తాజాగా.. ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ నిర్వహించిన సర్వే.. రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో సాగింది. ఈ సర్వేలో సుమారు 30 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితి వైసీపీ వ్యవహారం.. ఎంపీల పనితీరు వంటివాటిని భేరీజు వేసుకున్నప్పుడు.. ప్రజల నుంచి పెదవి విరుపులే కనిపించాయని సర్వే సంస్థ వెల్లడించింది. అయితే.. ప్రభుత్వం చేసిన సంక్షేమం తాలూకు ప్రభావం మాత్రం కొంత మేరకు ప్రతిపక్షాలకు బలంగా ఎదురు నిలవ నుంచి సర్వే పేర్కొంది.
తాజా అంచనా ప్రకారం.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు, తెలుగుదేశం పార్టీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది. తెలంగాణ సహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ లేదా బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చునని సర్వేలో తేలింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ జాతీయ పార్టీలు.. రెండూ ఒక్క సీటూ గెలుచుకునే అవకాశాలు లేవని ఒపీనియన్ పోల్ విశ్లేషించింది. అయితే.. ఇది టీడీపీ-జనసేన పొత్తుపై ఆధారపడి ఉంటుందని పేర్కొనడం గమనార్హం.
2019 లోక్ సభ ఎన్నికల్లో 25 సీట్లకు గాను వైసీపీ 22, టీడీపీ 3 స్థానాల్లో గెలిచాయి. కానీ ఈసారి వైసీపీ 7 సీట్లు కోల్పోవచ్చునని.. ఇవి విశాఖ, కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల్లోని కీలకమైన స్థానాలని సర్వే సంస్థ వెల్లడిం చింది. అవి టీడీపీ ఖాతాలో పడే అవకాశముందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది. మొత్తంగా చూస్తే.. వైసీపీ ఎంపీలపై ప్రజల్లో సానుకూలత లేదన్న విషయాన్ని సర్వే స్పష్టం చేసింది. ఇప్పటి నుంచి పోరాటం చేయగలిగితే.. తప్ప వైసీపీ అనుకూల పవనాలు వీచే అవకాశం లేదని తెలిపింది.